|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:13 AM
చంద్రబాబు నాయుడికి ఫైబర్నెట్ కేసులో భారీ ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ నమోదు చేసిన ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న చంద్రబాబుతో పాటు ఇతరులందరికీ క్లీన్చిట్ ఇస్తూ తుది తీర్పు వెలువరించింది.విచారణ చివరి దశకు చేరుకున్న సమయంలో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారుడైన ఫైబర్నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్రెడ్డి, ప్రాజెక్టు వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంటూ కేసును ఉపసంహరించుకుంటున్నట్లు గత నెల 24న కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనికి ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా అభ్యంతరం లేదని మరో అఫిడవిట్ సమర్పించడం గమనార్హం.2014-19 మధ్య ఫైబర్నెట్ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయించారని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.114 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ వైసీపీ హయాంలో సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును 25వ నిందితుడిగా చేర్చగా, నాటి కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ సాంబశివరావు తదితరులను కూడా నిందితులుగా పేర్కొన్నారు.తీర్పు వెలువడనున్న నేపథ్యంలో, వైసీపీ నేత, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతంరెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్తో కోర్టును ఆశ్రయించారు. తన వాదనలు వినాలని కోరారు. అయితే, ఈ పిటిషన్కు విచారణార్హత లేదని స్పష్టం చేసిన న్యాయమూర్తి పి. భాస్కరరావు, దానిని తిరస్కరించారు. ఆ తర్వాత వెంటనే ఫైబర్నెట్ ప్రధాన కేసును కూడా కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని టీడీపీ వర్గాలు మొదటి నుంచి ఆరోపిస్తున్న నేపథ్యంలో, కోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
Latest News