|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:27 PM
మహిళా సాధికారత కోసం.. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశాయి. ఈ డ్వాక్రా సంఘాలలోని మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ.. వ్యాపారాలు చేసుకునేలా, ఆర్థిక అవసరాలు తీర్చుకునేలా సహకారం అందిస్తూ.. అండగా ఉంటున్నాయి. అయితే డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండి.. సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే మహిళలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) సహకారంతో అలాంటి వారికి అండగా నిలిచేలా కార్యక్రమాలు చేపడుతోంది. సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే డ్వాక్రా మహిళలకు రుణాలు అందించటంతో పాటుగా.. వారికి మార్టులు, దుకాణాలు సైతం కేటాయిస్తోంది. దీని ద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది డీఆర్డీఏ. ఈ మార్టులు, దుకాణాల ద్వారా డ్వాక్రా మహిళలు ఉద్యోగులు, వ్యాపారులుగా మారి.. స్వయం ఉపాధి కూడా పొందుతున్నారు.
ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలోని డీఆర్డీఏ సంస్థ, జిల్లా సమాఖ్యలు కలిసి మన పంట, మన వంట.. మన ఆరోగ్యం పేరుతో డ్వాక్రా సంఘాలలోని మహిళలకు దుకాణాలు కేటాయిస్తున్నాయి. ఇప్పటికే విజయనగరం కార్పొరేషన్ పరిధిలో నాలుగు మినీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. వీటికి తోడుగా మెగా మార్టులను సైతం ఏర్పాటు చేస్తు్ననారు. ఈ దుకాణాలు, మార్టులలో అన్ని రకాల సరుకులు దొరికేలా చర్యలు తీసుకున్నారు. డ్వాక్రా సంఘాలు అందించే డబ్బుతో వీటిని నిర్వహిస్తున్నారు. వారినే ఉద్యోగులుగా నియమించారు.
మరోవైపు డీఆర్డీఏ కేటాయిస్తున్న ఈ దుకాణాలలో డ్వాక్రా సంఘాల మహిళలు ఉద్యోగులుగా ఉంటారు. 15 నుంచి 18 మంది డ్వాక్రా మహిళలను ఉద్యోగులుగా నియమించారు. వీరికి ప్రతి నెలా ఆరు వేల రూపాయల నుంచి 12 వేల రూపాయల వరకూ వేతనం చెల్లిస్తోంది డీఆర్డీఏ. అవసరం మేరకు అదనంగా మరికొంతమందిని కూడా ఉపయోగించుకుంటున్నట్లు విజయనగరం జిల్లా డీఆర్డీఏ అధికారులు వెల్లడించారు. ఈ దుకాణాల పర్యవేక్షణ కోసం ఏపీఎంలను సైతం నియమించారు. అలాగే ఈ మార్టులు, దుకాణాల ద్వారా రోజుకు 60 వేల వరకూ వ్యాపారం జరుగుతుండగా.. విక్రయాలు మరింత పెంచేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
Latest News