|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:36 PM
జరీబు భూముల సమస్యపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల్లోగా జరీబు భూముల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. సీఆర్డీఏ కార్యకలాపాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జరీబు భూముల సమస్యలపై స్పందించారు. అలాగే పరీక్షలు నిర్వహించి నేల స్వభావం గురించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి వెల్లడించారు. లంక భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించామని వివరించారు. మరోవైపు అమరావతిలో భూ సమీకరణ చేపట్టని భూముల్లో ప్లాట్లు పొందిన రైతుల సమస్య పెండింగ్లో ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. అక్కడి రైతులతో మాట్లాడిన తర్వాత భూసేకరణకు వెళ్తామని స్పష్టం చేశారు.వేరే చోట ప్లా్ట్లు కావాలని కోరిన వారికి లాటరీ ద్వారా కేటాయించేలా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు అమరావతి భూ సమీకరణకు సంబంధించి 2004 మంది రైతులు భూములను భూ సమీకరణకు ఇవ్వలేదని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. వారితో మరోసారి మాట్లాడనున్నట్లు వెల్లడించారు. 26 గ్రామాల్లో డీపీఆర్ చేసి ఇస్తామన్న పెమ్మసాని చంద్రశేఖర్.. సోమవారం నుంచి బౌండరీ స్టోన్స్లను రెండు వైపులా వేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం తరువాత గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి.. సోషల్ ఇన్ఫ్రాస్టక్చర్ గురించి, గ్రామ అభివృద్ధి ప్రణాళికల గురించి చర్చించనున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
మరోవైపు అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అమరావతిని మరింత విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే రెండో విడత భూసమీకరణ చేపట్టాలని ఇటీవల నిర్ణయించింది. తొలి విడతలో రైతుల నుంచి 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానం కింద సమీకరించిన ఏపీ ప్రభుత్వం.. రెండో విడతలో 16666 ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. మొత్తం ఏడు గ్రామాల పరిధిలో ఈ భూములను సమీకరించనున్నారు.
ఇందుకోసం రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం వంటి నిర్మాణాలను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం అదనంగా భూములను సమీకరించనున్నారు.పెదమద్దూరు, వడ్లమాను, ఎండ్రాయి, కర్లపూడి, వైకుంఠపురం, పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాల పరిధిలో భూములను సమీకరించనున్నారు.
Latest News