|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:18 PM
అనకాపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బీమా సొమ్ము కోసం కన్నవారిలా ఆదరించాల్సిన మామనే అల్లుడు, మనవడు కలిసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘోరాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించారు. అయితే, పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టి హత్య మిస్టరీని ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో వెల్లడించారు.కసింకోట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కుర్రు నారాయణమూర్తి (54) మృతదేహాన్ని ఈ నెల 9న పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో మరణించాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ, మృతదేహంపై ఉన్న గాయాలను చూసి పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా, నారాయణమూర్తి పేరు మీద ఆరు నెలల క్రితం వివిధ కంపెనీల నుంచి రూ.1.08 కోట్ల విలువైన బీమా పాలసీలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.నారాయణమూర్తి మరణిస్తే ఆ బీమా డబ్బులు తమకు వస్తాయనే దురాశతో అల్లుడు సుంకరి అన్నవరం, మనవడు సుంకరి జ్యోతి ప్రసాద్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టి అతడిని హత్య చేశారని తెలిపారు. ఈ హత్యకు సహకరించిన ఎల్ఐసీ ఏజెంట్ భీముని నానాజీ, మరో వ్యక్తి అగ్రహారపు తాతాజీని కూడా అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
Latest News