|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:48 PM
చైనా, టర్కీల అండదండలతో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ పదేపదే రెచ్చగొడుతున్న నేపథ్యంలో, భారత్కు 'ఆపరేషన్ సిందూర్ 2.0' తప్పదనిపిస్తోందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దుశ్యంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సాయుధ దళాలు దీనికి సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ (CLAWS) డైరెక్టర్ జనరల్గా ఉన్న ఆయన, గుజరాత్లోని సౌత్వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ నిరంతరం ఉల్లంఘిస్తోందని దుశ్యంత్ సింగ్ మండిపడ్డారు. "ఆపరేషన్ సిందూర్ ఒక ముగింపు కాదు, యుద్ధ నిర్వహణలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. భవిష్యత్తులోనూ శత్రువులతో వివాదాలు తప్పవు. అందుకే, ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం మనం ఎంత త్వరగా సిద్ధమైతే అంత మంచిది" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆనాటి ఆపరేషన్ పాకిస్థాన్ బలహీనతలను బయటపెట్టిందని, 1971 యుద్ధం తర్వాత మన త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో పనిచేయడం అదే తొలిసారని గుర్తుచేశారు.
Latest News