|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 08:40 PM
హోటల్లో పార్టీ జరుగుతుందన్న సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. దీంతో వారి నుంచి తప్పించుకోడానికి ఓ యువతి ప్రయత్నించింది. డ్రైనేజ్ పైప్ సాయంతో కిందకు దిగుతుండగా బాల్కనీ నుంచి జారిపడింది. ఈ క్రమంలో కిందపడిన 21 ఏళ్ల యువతికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దేశ ఐటీ రాజదాని బెంగళూరులో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.
యువతి తండ్రి అంటోనీ ఫిర్యాదు ప్రకారం.. బెంగళూరు బ్రూక్ఫీల్డ్లోని సీ ఎస్టేట్ లాడ్జిలో పార్టీ కోసం తన కుమార్తె, ఆమె ఏడుగురు స్నేహితులు వెళ్లారు. అక్కడ మూడు రూమ్లు బుక్ చేసి, అర్ధరాత్రి 1 గంట నుంచి దాదాపు ఉదయం 5 గంటల వరకు పార్టీ చేసుకున్నారు. అయితే, పార్టీ జరుగుతోన్న సమయంలో భారీ శబ్దాలకు హోటల్ చుట్టుపక్కల ఉండే నివాసితులు ఇబ్బందిపడ్డారు. వెంటనే హెల్ప్లైన్ నెంబరు 112కు ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ కాల్ అందిన తర్వాత, పోలీసులు లాడ్జికి చేరుకున్నారు. వారి అరుపులు, గొడవలు స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని ఆ బృందాన్ని మందలించినట్లు సమాచారం. అంతేకాదు, వారి వద్ద నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేసినట్టు ఆరోపిస్తున్నారు. దీనిని అధికారికంగా నిర్దారించాల్సి ఉంది. పోలీసులు ఎంట్రీతో కంగారుపడిన యువతి వారి నుంచి తప్పించుకోవాలని భావించింది. ఫోర్త్ ఫ్లోర్ నుంచి డ్రైనేజీ వైపు సాయంతో బాల్కనీ నుంచి దిగేందుకు ప్రయత్నించి, పట్టుతప్పి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్నేహితులు హుటాహుటిన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఫిర్యాదు ఆధారంగా సదరు హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదుచేశారు. బాల్కనీలో సరైన రక్షణ ప్రమాణాలు ఏర్పాటుచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఎఫ్ఐఆర్లో తెలిపారు. తమకు న్యాయం జరిగేలా కుమార్తె స్నేహితులను, లాడ్జి సిబ్బందిని, సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు సిబ్బందిని విచారించి సమగ్ర విచారణ జరపాలని కూడా యువతి తండ్రి ఫిర్యాదులో కోరారు. ఈ కేసులో బాధ్యులను తేల్చడానికి తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.