|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:29 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పుడే ఎన్నికల మూడ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అనంతరం.. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి 18 నెలలు పూర్తైంది. ఒకటిన్నర సంవత్సరం పదవీకాలం పూర్తికాగా.. మరో మూడు సంవత్సరాలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ.. 2024 సీన్ మరోసారి రిపీట్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగానేటీడీపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే పార్టీని ఇప్పటి నుంచే లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రామ, వార్డు, నగరం, మండల, పట్టణ కార్యవర్గాల ఎంపిక పూర్తికాగా.. టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది.
టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం కోసం త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేసిన చంద్రబాబు.. త్రీమెన్ కమిటీల క్షేత్రస్థాయి పర్యటనల అనంతరం కమిటీలు నివేదించిన రిపోర్టులను పరిశీలించినట్లు సమాచారం. అలాగే తన సొంత సర్వే రిపోర్టుల ఆధారంగా జిల్లా అధ్యక్షుల ఎంపికపై చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. మొత్తంగా టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక దాదాపుగా పూర్తైందని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షులుగా కొంతమంది పేర్లు దాదాపుగా ఖరారైనట్లు ఓ జాబితా బయటకు వచ్చింది. ఈ మేరకు టీడీపీ అధిష్టానం నుంచి వారికి సమాచారం అందినట్లు తెలిసింది. త్వరలో పార్టీ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.
బాపట్ల జిల్లాకు సలగల రాజశేఖర్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా రేచర్ల వెంకటేశ్వరరావు, నంద్యాలకు సుబ్బారెడ్డి, అనంతపురం కాలవ శ్రీనివాసులు, హిందూపురం ఎంఎస్ రాజు, తిరుపతి జిల్లా పనబాక లక్ష్మి, చిత్తూరు జిల్లా షణ్ముగం, ప్రకాశం ఉగ్రనరసింహారెడ్డి, విజయనగరం కిమిడి నాగార్జున, రాజంపేటకు సుగవాసి ప్రసాద్ పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం.
కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్, ఏలూరు జిల్లా బడేటి చందు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలిగా గద్దె అనురాధకు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లా అధ్యక్షులను నియమిస్తోంది టీడీపీ అధిష్టానం. వీరి ఎంపికపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Latest News