|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 07:21 PM
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అందివచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా విదేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను కూడా వారికి చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ .. జర్మనీలో నర్సు ఉద్యోగాల కోసం మన రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థినులకు ట్రైనింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగావకాశాలు సొంతం చేసుకునేలా మన రాష్ట్రంలోని బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులకు జర్మన్ భాష మీద ట్రైనింగ్ ఇస్తున్నారు.
తాజాగా దుబాయ్లో ఉద్యోగావకాశాలకు సంబంధించి గుంటూరు నైపుణ్యాభివృద్ధి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 22 చివరి తేదీ. ఈ నేపథ్యంలో ఆసక్తి, అర్హత కలిగిన యువత దరఖాస్తు చేసుకోవాలని గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు కోరారు.
ఇందులో భాగంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ.. కనీసం పదో తరగతి చదివిన వారికి దుబాయ్లో లాజిస్టిక్స్, ఏవియేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. అయితే ఇది కేవలం పురుషులకు మాత్రమే. అలాగే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. వయసు 21 నుంచి 37 ఏళ్ల లోపు వారై ఉండాలని అధికారులు ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థి అధిక బరువు ఉండకూడదు. శారీరకంగా బలంగా ఉండాలి. ఆంగ్ల భాషలో కనీసం ఎల్ టూ లెవల్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే కఠిన పరిస్థితులలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు ప్రకటనలో స్పష్టం చేశారు.
అలాగే ఆసక్తి గలవారు తమ దరఖాస్తులను నైపుణ్యం పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99888 53335, 87126 55686 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు వ్యక్తిగతంగా, లేదా ఆన్ లైన్ ద్వారా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశంఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,450 జీతంగా అందిస్తారు. అలాగే రవాణా, వైద్యం, ఇన్సూరెన్స్, వసతి, వర్క్ వీసా, విమాన టికెట్ వంటివి ఉచితంగా అందించనున్నారు.