|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 09:29 PM
కోపం మనిషిని విచక్షణ లేకుండా చేస్తుందంటారు.. కానీ ఈ స్థాయిలో ఉన్మాదానికి కారణమవుతుందని మాత్రం ఎవరూ ఊహించలేకపోవచ్చు. అలాంటి దారుణ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ మనం కుక్క కాటు గురించే వినుంటాం. కానీ మనిషి కాటు గురించి ఎప్పుడైనా విన్నారా.. ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా కొరకటమనేది ఎప్పుడైనా చూశారా. అలాంటి ఘటన శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో చోటుచేసుకుంది. తన కుక్క జోలికి వచ్చిన పక్కింటి వ్యక్తిని దారుణంగా కొరికేశాడో వ్యక్తి. అది కూడా మర్మాంగాన్ని. కోపంలో విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నాననేదీ స్పృహ లేకుండా వ్యవహరించాడు. దీంతో పాపం ఆ పక్కింటి ఆయన ఆస్పత్రి పాలయ్యాడు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లమాడ మండలంలోని వంకరకుంటకు చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ కుక్క అంటే అతనికి అభిమానం ఎక్కువ. అయితే కుళ్లాయప్ప పక్కింట్లో గోపాల్ అనే వ్యక్తి నివశిస్తున్నాడు. అయితే కుళ్లాయప్ప కుక్క గోపాల్ ఇంట్లోకి వచ్చి చెప్పులు కొరకటం, ఇంట్లోని వాళ్లని కరిచిందని గోపాల్ కుళ్లాయప్నను ప్రశ్నించాడు. కుక్కను కట్టేసుకోవాలంటూ కాస్త ఘాటుగా హెచ్చరించాడు. దీంతో కుళ్లాయప్ప ఒళ్లు మండిపోయింది. కోపం నషాళానికి ఎక్కింది. దీంతో నా కుక్కనే అంటావా అంటూ ఎక్కడలేని కోపంతో.. గోపాల్తో గొడవకు దిగాడు. మాటామాటా పెరగటంతో ఆవేశంలో.. గోపాల్ మీద దాడి చేసిన కుళ్లాయప్ప.. గోపాల్ మర్మాంగం వద్ద కొరికేశాడు. దీంతో గోపాల్ బాధతో విల్లవిల్లాడిపోయాడు.
ఇక్కడ ఇంకో దారుణం ఏమిటంటే.. గోపాల్ మీద కుళ్లాయప్ప దాడిచేసిన సమయంలో.. కుళ్లాయప్ప తండ్రి పోతులయ్య అతనికి సహకరించడం. గోపాల్ ఎటూ కదలకుండా పోతులయ్య గట్టిగా కాళ్లు పట్టుకోవటంతో కుళ్లాయప్ప.. గోపాల్ మర్మాంగం మీద దాడి చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో గోపాల్ తీవ్రంగా గాయపడగా.. అతని కుటుంబసభ్యులు చికిత్స కోసం అనంతపురం తరలించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనపై గోపాల్ కొడుకు నల్లమాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుళ్లాయప్పను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎంత కోపం వస్తే మాత్రం అక్కడెలా కొరికాడో అంటూ ఈ విషయం తెలిసిన స్థానికులు నోరెళ్లబెడుతున్నారు.
Latest News