|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 09:52 PM
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్తో జరిగిన సైనిక ఘర్షణ గురించి పాకిస్థాన్ త్రివిధ దళాల అధిపతి, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో జరిగిన సైనిక ఘర్షణలో తమకు దేవుడు నుంచి సహాయం అందిందని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్ , పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు చివరకు కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.
ఇస్లామాబాద్లో నాలుగు రోజుల పాటు జరిగే నేషనల్ ఉలేమా కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ అసీమ్ మునీర్ .. అఫ్గనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లేదా తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP)లలో ఎవరినో ఒకరిని ఎంచుకోవాలని తాలిబన్లను హెచ్చరించారు. దేశంలోకి చొరబడుతోన్న ఉగ్రవాదులలో ఎక్కువ మంది అఫ్గన్ జాతీయులేనని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో మునీర్ ఖురాన్లోని కొన్ని వాక్యాలను పఠిస్తూ.. భారత్తో జరిగిన సైనిక సంఘర్షణ గురించి ప్రస్తావించారు. పాకిస్థాన్ సైన్యం భారత్తో పోరాడుతున్నప్పుడు ‘దేవుడి సాయం’ పొందిందని పాక్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ మునీర్ అన్నారు. ‘మేము దానిని అనుభవించాం’ అని మునీర్ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ఏర్పాటును 1,400 సంవత్సరాల కిందట అరబ్ ప్రాంతంలో (నేటి సౌదీ అరేబియా) ప్రవక్త స్థాపించిన రాజ్యంతో మునీర్ పోల్చడం గమనార్హం. ప్రపంచంలో 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయని, వాటిలో ‘హరమైన్ షరీఫైన్’ (మక్కా, మదీనా) సంరక్షకులుగా ఉండటం దేవుడు మాకు ఇచ్చిన గౌరవం’ అని పాక్ త్రివిధ దళాధిపతి పేర్కొన్నారు. టీటీపీ (TTP) లోకి వస్తున్న వారిలో 70 శాతం మంది అఫ్గన్ జాతీయులేనని ఆయన ఆరోపించారు.
‘‘అఫ్గనిస్థాన్ మన పాకిస్థానీ పిల్లల రక్తాన్ని చిందించడం లేదా?’ అని అతడు ప్రశ్నించారు. ఈ క్రమంలో పాకిస్థాన్ లేదా టీటీపీలో ఎవరో ఒకరిని తాలిబన్లు ఎంచుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు. ఒక ఇస్లామిక్ రాజ్యంలో ప్రభుత్వం తప్ప మరెవరూ జిహాద్కు ఆదేశించలేరని పాక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నారు. ‘అధికారం ఉన్నవారి ఆదేశం, అనుమతి, సంకల్పం లేకుండా ఎవరూ జిహాద్ కోసం ఫత్వా జారీ చేయలేరు’ అని ఆయన సమావేశంలో చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడిపోయింది. భారత సైన్యం దెబ్బకు కాళ్లబేరానికి వచ్చి, కాల్పులు విరమణ కోసం దాయాది ప్రాదేయపడటంతో ఇరు దేశాలూ డీజీఎంఓలు మధ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే.
Latest News