|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 11:27 PM
ఇండోనేషియాలోని జావా ప్రధాన ద్వీపంలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక ప్రయాణీకుల బస్సు అదుపుతప్పి కాంక్రీట్ బారియర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదంలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు.
అర్ధరాత్రి వేళ మృత్యుఘోష..
స్థానిక అధికారులు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ బుడియోనో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అంతరాష్ట్ర బస్సు రాజధాని జకర్తా నుంచి పురాతన రాజ నగరం యోగ్యకర్తకు బయలుదేరింది. సోమవారం అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే.. మధ్య జావాలోని సెమరాంగ్ సిటీలో ఉన్న క్రాప్యాక్ టోల్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా ఒక మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. బస్సు వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న కాంక్రీట్ బారియర్ను బలంగా ఢీకొట్టి పక్కకు బోల్తా పడింది.ఇదీ చూడండి: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, మృతుల్లో తిరుచానూరు ఆలయ కార్మికులు
ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. బస్సు బారియర్ను ఢీకొట్టిన ధాటికి కొందరు ప్రయాణికులు కిటికీల నుంచి బయటకు ఎగిరి పడ్డారు. మరికొందరు బస్సు బాడీ మధ్యలో నలిగిపోయి లోపలే చిక్కుకుపోయారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన వారు రంగంలోకి దిగారు. ఆపై 40 నిమిషాల తర్వాత సహాయక బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బస్సులోంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. అక్కడికక్కడే మొత్తం ఆరుగు చనిపోగా.. మిగతా 10 మందిని ఆస్పత్రికి తరలించేటప్పుడు ప్రాణాలు కోల్పోయారు.
అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన మరో 18 మందిని తక్షణమే సమీపంలోని రెండు ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. మిగిలిన 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతుండగా.. చూసిన వారంతా షాక్ అవుతున్నారు. వీడియోలు హృదయవిదారకంగా ఉండడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమా లేదా వాహనంలో సాంకేతిక లోపం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Latest News