|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 08:45 PM
రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో పల్లె వెలుగు సర్వీసుల కోసం కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులనే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రోజు ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇకపై పల్లె వెలుగు సర్వీసుల కోసం కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులనే ప్రవేశపెట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో పల్లె వెలుగు సర్వీసుల కోసమైనా సరే తప్పనిసరిగా ఏసీ బస్సులే నడపాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా1,450 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని రవాణా శాఖ అధికారులకు చంద్రబాబు సూచించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాలలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
మరోవైపు వచ్చే ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సీఎం అంగీకారం తెలిపారు. దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని.. పర్యావరణహిత ప్రజా రవాణాకు పెద్ద పీట వేయాలని ఆదేశించారు. 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం నడిచిన బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని సూచించారు.
స్త్రీ శక్తి పథకంతో బస్సులలో రద్దీ పెరిగిన నేపథ్యంలో.. అందుకు తగినట్టుగా కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని చంద్రబాబు సూచించారు. ఆర్టీసీ అధికారులు ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని.. ఇందులో భాగంగా రైల్వే శాఖ తరహాలో కార్గో రవాణాపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. తాజాగా కొత్తగా ప్రవేశపెట్టే పల్లెవెలుగు బస్సులకు కూడా ఏసీ బస్సులనే ఉపయోగించాలని నిర్ణయించడంతో మహిళలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
Latest News