|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:51 PM
రాజకీయాల్లో నేతల మధ్య విభేదాలు రావడం, పార్టీలు మారడం సాధారణమైన విషయమే. కానీ పార్టీ సిద్ధాంతం కోసం.. ఏకంగా కట్టుకున్న భర్తనే వదిలేసిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో సంచలనం రేపుతోంది. బీజేపీ పట్ల తనకున్న అపారమైన విధేయతను చాటుకుంటూ.. నాగ్పూర్ మాజీ మేయర్ అర్చన దేహంకర్ తన భర్త వినాయక్ దేహంకర్ నుంచి విడిపోయి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. 17వ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని వినాయక్ దేహంకర్ గట్టిగా ఆశించారు. అయితే పార్టీ అధిష్ఠానం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చి, కాంగ్రెస్ నుంచి కొత్తగా బీజేపీలో చేరిన మనోజ్ సాబ్లేకు టికెట్ కేటాయించింది. ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వినాయక్.. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా (ఇండిపెండెంట్) నామినేషన్ వేశారు.
నాకు పార్టీయే ప్రాణం.. భర్త ఇంటి నుంచి పుట్టింటికి!
భర్త తీసుకున్న ఈ నిర్ణయం అర్చన దేహంకర్కు అస్సలు నచ్చలేదు. ఆమెకు బీజేపీ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు.. తనను మేయర్గా (2009-12) నిలబెట్టిన గొప్ప సంస్థ అని ఆమె నమ్ముతారు. "పార్టీ నాకు గౌరవాన్ని, పదవిని ఇచ్చింది. అలాంటి పార్టీకి వెన్నుపోటు పొడవడం అన్యాయం" అని ఆమె వాదించారు. భర్తను తన నిర్ణయం మార్చుకోవాలని కోరినప్పటికీ ఆయన వినకపోవడంతో.. ఆమె కఠిన నిర్ణయం తీసుకున్నారు. భర్త ఇంటిని వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయారు.
ఇల్లు వదలడమే కాకుండా ఆమె మరో సంచలన ప్రకటన చేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, పార్టీ అధికారిక అభ్యర్థి గెలుపు కోసమే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. తన పుట్టింటి నుంచే బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో స్థానిక ప్రజలు సహా అంతా షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండటం చూశాం కానీ.. ఒకే పార్టీలో ఉంటూ టికెట్ రాలేదన్న కోపంతో భర్త తిరుగుబాటు చేస్తే.. భార్య ఆయనను వదిలేసి పార్టీ వైపు నిలబడటం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.