|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:59 PM
దేశం అన్నిరంగాల్లోనే అద్భుతమైన అభివృద్ధి సాధిస్తోందని చెబుతున్నా.. మారుమూల గిరిజన పల్లెల్లో నేటికీ మౌలిక సదుపాయాల కొరత నిండు ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో చోటుచేసుకున్న ఒక హృదయ విదారక ఘటన వ్యవస్థల వైఫల్యాన్ని ఎండగడుతోంది. సరైన రహదారి మార్గం లేకపోవడంతో ఒక నిండు గర్భిణి ప్రసవం కోసం అడవి మార్గంలో కిలో మీటర్ల కొద్దీ నడవాల్సి వచ్చింది. ఫలితంగా తీవ్ర రక్తస్రావమై ఆ తల్లితో పాటు కడుపులోని శిశువు కూడా కూడా ప్రాణాలు కోల్పోయింది.
అడవి మార్గంలో ఆవేదన..
ఎటపల్లి తాలూకాలోని ఆల్దండి టోలో గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఆశా సంతోష్ కిరంగ తొమ్మిది నెలల గర్భిణి. ఆమె ఉంటున్న గ్రామానికి కనీసం రహదారి సౌకర్యం కూడా లేదు. దీనికి తోడు గ్రామంలో ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. ప్రసవ సమయం దగ్గర పడటంతో.. ఆసుపత్రికి వెళ్లే మార్గం లేక ఆమె తన భర్తతో కలిసి అడవి గుండా దాదాపు 6 కిలో మీటర్ల మేర కాలినడకన ప్రయాణించింది. అతి కష్టం మీద పెథాలో ఉన్న తన సోదరి ఇంటికి చేరుకుంది.
సోదరి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఆశాకు పురిటి నొప్పులు తీవ్రం అయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అడవి మార్గంలో అంత దూరం నడవడం వల్ల ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆసుపత్రికి చేరుకునే సరికి పరిస్థితి విషమించడంతో కడుపులోని శిశువు మరణించింది. అధిక రక్తపోటు కారణంగా వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ.. ఆశాను కాపాడలేక పోయారు. తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ఘటనపై జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతాప్ శిందే స్పందించారు. గర్భిణిని రక్షించేందుకు వైద్య బృందం శాయశక్తులా ప్రయత్నించిందని.. కానీ తీవ్ర రక్తస్రావం వల్ల ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఈ మృతికి గల కారణాలపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని తాలూకా ఆరోగ్య అధికారిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. గ్రామంలో రోడ్డు, వైద్య సదుపాయాల కొరతపై కూడా విచారణ జరుపుతామని ఆయన వెల్లడించారు. రహదారి వంటి కనీస అవసరం లేకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం బలికావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Latest News