|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 07:53 PM
బెట్టింగ్ భూతం.. సరదాగా మొదలై వ్యసనంగా మారి జీవితాన్ని బలితీసుకునే వికృత క్రీడ. ఈ రాకాసికి ఇప్పటికే ఎన్నో నిండు ప్రాణాలు బలైపోయాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయినా మహమ్మారి కోరలు చాస్తూనే ఉంది. ఎక్కడో అక్కడ బెట్టింగ్ భూతానికి అమాయక ప్రాణాలు బలౌతూనే ఉన్నాయి. బెట్టింగ్ భూతాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ ప్రమోషన్ల మీద నిషేధం విధించాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న అనేక మంది సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి వారిని విచారణ కూడా చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులలో గుంటూరు జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. బెట్టింగ్ కారణంగా అప్పుల పాలయ్యాయని.. ఆత్మహత్య చేసుకుంటానంటూ టవర్ ఎక్కాడో వ్యక్తి. తాడికొండ నియోజకవర్గంలోని మల్కాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా మల్కాపురంలో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. గ్రామంలోని టవర్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాంబాబు అనే వ్యక్తి బెట్టింగ్కు అలవాటు పడ్డారు. సరదాగా మొదలైంది కాస్తా.. వ్యసనంగా మారింది. దీంతో అప్పులు చేసి మరీ బెట్టింగ్ ఆడటం మొదలుపెట్టారు. ఇలా కొన్ని లక్షల రూపాయలు బెట్టింగ్లో పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో ఇలా టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే పోలీసులు నచ్చజెప్పి కిందకు దించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే బెట్టింగ్ గురించి రాంబాబు వెర్షన్ మరోలా ఉంది. సినీ ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతోనే తాను అప్పులు చేసి మరీ ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్లు రాంబాబు చెప్తున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక.. కిడ్నీలు అమ్ముకోవడానికి కూడా సిద్ధపడినట్లు చెప్పుకొచ్చారు. అప్పులు వాళ్ల బెదిరింపులు తట్టుకోలేకపోతున్నానని.. అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడినట్లు చెప్పుకొచ్చారు. అయితే పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని మనోణ్ని టవర్ పై నుంచి కిందకు దింపడంతో అందరూ హమ్మయ్యా అనుకున్నారు. తొందరగా, సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో బెట్టింగ్ మాయలో పడొద్దని.. ఆ ఉచ్చులో చిక్కి జీవితాలను బలి చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Latest News