|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 08:51 PM
బిహార్లో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అతి త్వరలోనే కొలువుదీరనుంది. దాదాపు 10 ఏళ్లుగా తమిళనాడులో చెక్కిన శివలింగం ప్రస్తుతం బిహార్కు చేరింది. తమిళనాడు నుంచి 2500 కిలోమీటర్లు సుదీర్ఘంగా ప్రయాణించిన తర్వాత.. 210 టన్నుల బరువైన ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాకు చేరుకుంది. ఈనెల 17వ తేదీన తూర్పు చంపారన్లోని విరాట్ రామాయణ్ మందిరంలో ఈ శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
270 అడుగుల ఎత్తుతో నిర్మితం అవుతున్న ఈ విరాట్ రామాయణ్ మందిర్ .. భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా నిలవనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గ్రానైట్ శివలింగం ఈ ఆలయ ప్రాంగణంలో కొలువుదీరనుంది. ఈ భారీ శివలింగం బరువు 210 టన్నులు కాగా.. ఎత్తు 33 అడుగులు.. చుట్టుకొలత కూడా 33 అడుగులతో తయారు చేశారు.
తమిళనాడులోని మహాబలిపురంలో ఒకే ఒక్క బ్లాక్ గ్రానైట్ రాయితో ఈ భారీ శివలింగాన్ని తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి శిల్పులకు దాదాపు 10 సంవత్సరాల సమయం పట్టడం గమనార్హం. తమిళనాడు మహాబలిపురం నుంచి బిహార్లోని గోపాల్గంజ్ వరకు దాదాపు 2,500 కిలోమీటర్ల దూరాన్ని ఈ శివలింగం ఒక ప్రత్యేక 96 చక్రాల హైడ్రాలిక్ ట్రక్కుపై 45 రోజుల పాటు ప్రయాణించి చేరుకుంది.
జనవరి 17వ తేదీన జరిగే శివలింగ ప్రతిష్ఠాపన సమయంలో కైలాస మానస సరోవర్, గంగోత్రి, హరిద్వార్, ప్రయాగ్రాజ్, సోనేపూర్ వంటి 5 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేయనున్నారు.
విరాట్ రామాయణ్ మందిరం
ఈ విరాట్ రామాయణ్ మందిరం 120 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం కంటే ఎత్తుగా 270 అడుగుల్లో నిర్మితం అవుతోంది. బిహార్ రాజధాని పాట్నాలోని మహావీర్ మందిర్ ట్రస్ట్ సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ఆలయ సముదాయంలో మొత్తం 18 గోపురాలు, 22 మందిరాలు ఉండనున్నాయి. ప్రధాన మందిరం ఎత్తు 270 అడుగులు కాగా.. ఇది 2030 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.