|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 08:03 PM
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా.. తెలుగు రాష్ట్రాలలో చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉన్న ఆసక్తికర అంశమిది. గతంలో టీడీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు జూనియర్ ఎన్టీఆర్. 2009 ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత వివిధ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చింది. 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం లేకుండానే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే 2019 ఎన్నికల్లో దారుణ ఓటమితో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని.. అప్పుడే టీడీపీకి పునర్వైభవం అనే చర్చ మొదలైంది. టీడీపీలోని ఓ వర్గం కూడా రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావాలని కోరుకుంది.
అయితే తారక్ మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. ఈ క్రమంలోనే టీడీపీ, ఎన్టీఆర్ మధ్య దూరం మరింత పెరిగింది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించడంతో.. ఎన్డీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే ప్రస్తావన దాదాపుగా తెరమరుగైంది. అయితే ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోరుకుంటున్నారనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై అప్పుడప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైఎస్ జగన్ కోరుకుంటున్నారా అంటూ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఈ రకంగా సమాధానం ఇచ్చారు. "తెలుగుదేశం పార్టీలోని 70 నుంచి 80 శాతం మంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. నిజమైన వారసుడు అతనే అని భావిస్తున్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థలో జూనియర్ ఎన్టీఆర్ అయితే కొత్త ముఖమని.. ఆయన వస్తే రాజకీయాలు ఇంత దిగజారి ఉండవని జగన్ కూడా భావిస్తూ ఉండొచ్చు" అని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోని 80 నుంచి 90 శాతం మంది తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నారని అన్నారు. అలాగే బీఆర్ఎస్లోని 80 నుంచి 90 శాతం మంది ఏపీలో వైసీపీ గెలవాలని కోరుకుంటారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, కేటీఆర్లకు వైఎస్ జగన్తో సత్సంబంధాలు ఉండటమే ఇందుకు కారణమని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి, చంద్రబాబు గురుశిష్యులని.. వారిని ఓడించాలనుకోవడం కూడా ఒక కారణమన్నారు.
Latest News