|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 09:27 PM
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో భారతీయ సంతతి వ్యక్తులు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో బ్రిటన్లోని వివిధ జాతుల మధ్య సంపద పంపిణీలో భారీ వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్లు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వెల్లడించింది. ముఖ్యంగా భారతీయుల తలసరి ఆదాయం, పొదుపు గణనీయంగా పెరగగా.. పాకిస్థానీ, బ్లాక్ ఆఫ్రికన్ కమ్యూనిటీల ఆర్థిక స్థితిగతులు దారుణంగా పడిపోయాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.
భారతీయుల సంపదలో రూ.93 లక్షల పెరుగుదల
"ద ఎత్నిక్ వెల్త్ డివైడ్ ఇన్ ద యూకే" పేరుతో ఎలెని కరాగియానాకి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. 2012 నుంచి 2023 మధ్య కాలంలో భారతీయుల సగటు సంపద ఏకంగా 93,000 పౌండ్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.93 లక్షలకు పైగా) మేర పెరిగింది. బ్రిటన్లో పుట్టి పెరిగిన భారతీయ సంతతి వ్యక్తులు, అక్కడి స్థానిక శ్వేతజాతీయుల కంటే కూడా ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. స్థిరమైన ఆదాయ వృద్ధి, చిన్న వయస్సు నుంచే ఆస్తులను కూడబెట్టడం భారతీయుల విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
భారతీయులు ఆర్థికంగా దూసుకుపోతుంటే.. పాకిస్థానీ కమ్యూనిటీ మాత్రం తీవ్ర గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. గత దశాబ్ద కాలంలో వీరి సంపద పెరగకపోగా, భారీగా తగ్గుముఖం పట్టింది. బంగ్లాదేశీయులు, బ్లాక్ ఆఫ్రికన్లు, బ్లాక్ కరేబియన్ వర్గాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వీరిలో కనీసం 50 శాతం మందికి ఎటువంటి పొదుపు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. భారతీయ, శ్వేతజాతీయులు తమ ఆర్థిక స్థాయిని పెంచుకుంటూ పైకి వెళ్తుంటే.. పాకిస్థానీ, ఆఫ్రికన్ వర్గాలు ఉన్నత స్థాయి నుంచి దిగువకు పడిపోతున్నాయని నివేదిక విశ్లేషించింది.
ఆస్తుల యాజమాన్యం విషయంలోనూ భారతీయులు ముందున్నారు. 2012లో ఉన్న అంతరం 2023 నాటికి మరింత పెరిగింది. భారతీయులు ఇళ్లు కొనడం, షేర్ మార్కెట్ వంటి పెట్టుబడులపై దృష్టి పెట్టగా.. బంగ్లాదేశీ, పాకిస్థానీ వర్గాల్లో సొంత ఇళ్ల శాతం భారీగా పడిపోయింది. శ్వేతజాతీయులు, భారతీయుల ఆదాయ వృద్ధి స్థిరంగా ఉండగా.. పాకిస్థానీ, బంగ్లాదేశీ వర్గాల ఆదాయం బ్రిటన్ సగటు ఆదాయం కంటే చాలా తక్కువగా ఉండటమే ఈ భారీ అంతరానికి కారణమని పరిశోధకులు తేల్చారు.
Latest News