|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 06:49 PM
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. బైక్ ప్రమాదానికి గురై రోడ్డుపై పడిపోవటం.. ఆ పడిపోయిన బైక్ను బస్సు ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకుని వెళ్లటం.. ఈ రాపిడికి బస్సులో మంటలు చెలరేగి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మంటల్లో సజీవదహనం కావటం అప్పట్లో పెను విషాదాన్ని నింపింది. అయితే కర్నూలు ప్రమాదం తరహాలోనే అన్నమయ్య జిల్లాలో ప్రమాదం జరిగింది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని గాలివీడు రింగ్రోడ్డు జంక్షన్లో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సమయంలో ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి కడప వైపు వెళుతున్న కంటైనర్ ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో కంటైనర్ ముందు భాగంలో బైక్ ఇరుక్కు పోయింది. కంటైనర్ డ్రైవర్ నియంత్రణ చేయలేకపోవటంతో.. అలాగే సుమారుగా 20 మీటర్ల దూరం కంటైనర్ బైక్ను ఈడ్చుకెళ్లింది. ఈ రాపిడికి బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిల మంటలు చెలరేగాయి. ఆ మంటలు కంటైనర్ వరకూ వ్యాపించాయి. అయితే ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు.
అయితే అప్పటికే కంటైనర్ సగం వరకూ కాలిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ మీదు వెళుతున్న శ్రీనివాసులు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసులు స్వస్థలం రాయచోటి మండలం కంచరపల్లెగా గుర్తించారు. శ్రీనివాసులు భార్య ఉపాధి కోసం విదేశాలకు వెళ్లగా.. శ్రీనివాసులు తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అయితే అనుకోకుండా జరిగిన ప్రమాదం.. అతని కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Latest News