|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 08:10 PM
అమ్మా అని పిలిపించుకొని మురిసిపోవాల్సిన ఆ తల్లి.. కసాయిలా మారింది. కన్నతల్లి లేని లోటు తీర్చాల్సిన ఆమే.. ఆ నాలుగేళ్ల చిన్నారి పాలిట కాలయముడిలా మారాయి. కేవలం నిద్రలో పరుపు తడిపిందన్న చిన్న కారణంతో.. పసిపాప అని కూడా చూకుండా.. అట్లకాడ కాల్చి చిన్నారి మర్మాంగాలపై వాతలు పెట్టింది. ఈ అమానవీయ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లా కంజీకోడ్ సమీపంలో వెలుగుచూసింది.
అంగన్వాడీ టీచర్ అప్రమత్తతతో వెలుగులోకి..
గత వారం జరిగిన ఈ కిరాతకం వెలుగులోకి రావడానికి ఓ అంగన్వాడీ ఉపాధ్యాయురాలి అప్రమత్తతే కారణమైంది. క్లాసులో ఆ నాలుగేళ్ల చిన్నారి కూర్చోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండటం, ముఖంలో చెప్పలేనంత బాధను ఆ టీచర్ గమనించారు. సందేహం వచ్చి ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని విచారించగా.. ఒళ్లు గగుర్పొడిచే నిజం బయటపడింది. పాప ప్రైవేట్ భాగాలపై తీవ్రమైన కాలిన గాయాలు ఉండటాన్ని చూసి ఆ ఉపాధ్యాయురాలు చలించిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. బీహార్కు చెందిన నిందితురాలు.. నేపాల్కు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే ఆ వ్యక్తికి మొదటి భార్య ద్వారా కలిగిన ఈ చిన్నారిని తనతో పాటే ఉంచుకుంది. అయితే పాప నిద్రలో పరుపు తడిపిందని కోపంతో ఊగిపోయిన ఆ మహిళ.. వంటింట్లో ఉన్న స్టీల్ అట్లకాడను స్టవ్ మీద వేడి చేసి పాప మర్మాంగాలపై వాతలు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితురాలిని గురువారం అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమెపై భారతీయ న్యాయ సంహిత, జువనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ప్రస్తుతం ఆ చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తమ సంరక్షణలోకి తీసుకుంది. హోటల్లో పని చేసే పాప తండ్రి ఈ విషయంలో తన భార్యను సమర్థించారా లేక ఆయనకు తెలియకుండానే ఇదంతా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. నాగరిక సమాజంలో పసిపిల్లలపై జరుగుతున్న ఇటువంటి పైశాచిక దాడులు మానవ సంబంధాల మీద ఉన్న నమ్మకాన్ని సడలిస్తున్నాయి.
Latest News