|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 09:35 PM
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అమెరికా అధికారికంగా వైదొలగడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన రెండో విడత పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే గతేడాది తీసుకున్న ఈ నిర్ణయం.. జనవరి 22వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దీంతో గత 78 ఏళ్లుగా డబ్ల్యూహెచ్ఓలో సభ్య దేశంగా ఉన్న అమెరికా.. గురువారంతో అధికారికంగా తన సభ్యత్వాన్ని ముగించుకుంది. గతేడాది ట్రంప్ ఇచ్చిన నోటీసు గడువు ముగియడంతో ఈ ప్రక్రియ పూర్తి అయింది.
నిష్క్రమించే సమయంలో అమెరికా సుమారు 260 మిలియన్ డాలర్ల (అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.2382 కోట్లు) సభ్యత్వ రుసుమును అమెరికా చెల్లించాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ఈ బకాయిలను చెల్లించే చట్టపరమైన బాధ్యత తమకు లేదని అమెరికా ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో డబ్ల్యూహెచ్ఓ పూర్తిగా విఫలం అయిందని.. చైనా ఒత్తిడికి లొంగి పనిచేస్తోందని ట్రంప్ సర్కార్ ఆరోపిస్తోంది. అవసరమైన సంస్కరణలను డబ్ల్యూహెచ్ఓ చేపట్టడం లేదని పేర్కొంది.
ఇప్పటివరకు డబ్ల్యూహెచ్ఓకు అమెరికానే అతిపెద్ద దాతగా నిలిచింది. 2022-23 కాలంలో దాదాపు 1.3 బిలియన్ డాలర్ల నిధులను అమెరికా డబ్ల్యూహెచ్ఓకు అందించింది. ఇప్పుడు ఈ నిధులు ఒక్కసారిగా నిలిచిపోవడంతో అంతర్జాతీయ ఆరోగ్య ప్రాజెక్టులపై ప్రభావం పడనుందనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పోలియో నిర్మూలన, తల్లీబిడ్డల ఆరోగ్య కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) వంటి వైరస్ల సమాచారాన్ని దేశాల మధ్య పంచుకునే వ్యవస్థ నుంచి అమెరికా తప్పుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కొత్త వ్యాక్సిన్ల తయారీలో మరింత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగాలన్న అమెరికా నిర్ణయాన్ని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డాక్టర్ రోనాల్డ్ నహాస్.. శాస్త్రీయంగా బాధ్యతారాహిత్యమని అభివర్ణించారు. సూక్ష్మజీవులకు సరిహద్దులు ఉండవని.. అంతర్జాతీయ సహకారం విలాసం కాదని, అవసరమని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు.
Latest News