|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 10:47 PM
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ తనదైన శైలిలో పలు అంశాలపై స్పందిస్తూ.. సందడి చేశారు. బ్లాక్రాక్ సీఈఓ లారీ ఫింక్తో కలిసి నిర్వహించిన ప్యానెల్ చర్చలో పాల్గొన్న మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఇది బోర్డ్ ఆఫ్ పీస్ కాదని.. గ్రీన్లాండ్ పీస్ (ముక్క) అంటూ విసిరిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యాయి.
గ్రీన్ల్యాండ్ ముక్క కావాలా?
గాజాలో కాల్పుల విరమణను పర్యవేక్షించేందుకు ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మస్క్ స్పందిస్తూ.. "ట్రంప్ ఏర్పాటు చేసిన ఆ బోర్డు పేరులో ఉన్నది 'Peace' (శాంతి) అనుకోవాలా.. లేక అది 'Piece' (ముక్క) అనుకోవాలా? బహుశా అది గ్రీన్ల్యాండ్లో ఒక ముక్క లేదా వెనిజులాలో ఒక ముక్క కావాలని ఆయన కోరుకుంటున్నారేమో" అని ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్లోని ‘పీస్’ అనే పదానికి ఉన్న రెండు అర్థాలను వాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ట్రంప్తో సత్సంబంధాలు ఉన్నప్పటికీ.. ఆయన విదేశీ విధానాలపై మస్క్ ఇలా బహిరంగంగా సెటైర్లు వేయడం గమనార్హం.
ఈ చర్చా వేదికగానే మస్క్ మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో రోబోలు సమాజాన్ని పూర్తిగా మార్చేస్తాయని.. భూమిపై మనుషుల కంటే రోబోల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. అలాగే టెస్లా అభివృద్ధి చేస్తున్న ‘ఆప్టిమస్’ హ్యూమనాయిడ్ రోబోలను 2027 చివరి నాటికి ప్రజలకు విక్రయించడం ప్రారంభిస్తామని మస్క్ ప్రకటించారు. వృద్ధుల సంరక్షణ, పిల్లల పనుల కోసం ప్రతి ఒక్కరూ ఒక రోబోను కోరుకుంటారని మస్క్ తెలిపారు. 2026 పూర్తయ్యే నాటికి ఒక మనిషి కన్నా ఏఐ తెలివైనదిగా మారుతుందని, 2030 నాటికి మొత్తం మానవాళి మేధస్సు కంటే కృత్రిమ మేధస్సు మిన్నగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
వివాదాల నడుమ మస్క్ హాజరు
దావోస్ సదస్సును గతంలో ‘బోరింగ్’ అని, ‘ఎలైట్ క్లబ్’ అని విమర్శించిన మస్క్.. ఈసారి అనూహ్యంగా హాజరుకావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మస్క్ నేతృత్వంలో అభివృద్ధి చేసిన ‘గ్రోక్’ అనే ఏఐ టూల్ ప్రస్తుతం తీవ్ర వివాదంలో ఉంది. గ్రోక్ ద్వారా లక్షలాది అశ్లీల చిత్రాలను సృష్టించారని ఆరోపిస్తూ.. యూకే, భారత్, ఇండోనేషియా వంటి దేశాలు ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించాయి.
Latest News