|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 05:30 PM
కాంగ్రెస్ పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని, ఆపరేషన్ సిందూర్ విషయంలోనే తనకు పార్టీతో విభేదాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పేర్కొన్నారు. కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో మనకు మన దేశమే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పార్లమెంటులో తాను ఎల్లప్పుడూ పార్టీ నియమావళికి అనుగుణంగానే వ్యవహరించానని ఆయన నొక్కి చెప్పారు.పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ను ఎండగట్టేందుకు విదేశాలకు వెళ్లిన దౌత్య బృందాల్లో శశిథరూర్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన వ్యవహారశైలిపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఆయన తీరు పట్ల పార్టీ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయంపై ఆయన తాజాగా స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ విషయంలో తన వైఖరిని సమర్థించుకున్నారు. ఈ విషయంలో తాను ఎప్పటికీ క్షమాపణ చెప్పేది లేదని ఆయన తేల్చి చెప్పారు.ఒక రచయితగా పహల్గామ్ గురించి ఒక కథనం రాశానని, ఉగ్రదాడులకు తగినవిధంగా సైనిక ప్రతిస్పందన ఉండాలని తాను అభిప్రాయపడ్డానని అన్నారు. అభివృద్ధిపై దృష్టి సారించిన భారత్ పాకిస్థాన్తో దీర్ఘకాల ఘర్షణలకు వెళ్లకుండా ఉగ్రశిబిరాలను లక్ష్యంగా చేసుకోవాలని తాను రాసినట్లు తెలిపారు. ఆ కథనంలో తాను చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నారు.
Latest News