|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 08:52 PM
అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన మంచు తుఫాను దేశాన్ని వణికిస్తోంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 2 వేల మైళ్ల విస్తీర్ణంలో ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దాదాపు 20 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్రమైన శీతల వాతావరణం, మంచు హెచ్చరికల మధ్య గడుపుతున్నారు.పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాషింగ్టన్ డీసీతో పాటు అలబామా, జార్జియా, కెంటకీ, న్యూయార్క్, టెక్సాస్ సహా 16కుపైగా రాష్ట్రాలు ఇప్పటికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి దూసుకొచ్చిన పోలార్ వోర్టెక్స్ కారణంగా అతి శీతల గాలులు, శక్తివంతమైన తుఫాను వ్యవస్థ కలవడంతో ఈ విపత్కర పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.ఈ మంచు తుఫాను ప్రభావంతో దేశవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా విమాన రవాణా పూర్తిగా కుంటుపడింది. ఫ్లైట్ అవేర్ గణాంకాల ప్రకారం, ఈ వారాంతం వరకు ఇప్పటికే 8 వేలకుపైగా విమానాలను రద్దు చేశారు.డెల్టా, అమెరికన్, యునైటెడ్ ఎయిర్లైన్స్ వంటి ప్రముఖ ఎయిర్లైన్స్ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసి, టికెట్ మార్పు రుసుములను తాత్కాలికంగా రద్దు చేశాయి. అలాగే టెక్సాస్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు పలు విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) హెచ్చరించింది.మంచు ప్రభావం ప్రయాణ రంగానికే కాకుండా విద్యుత్ సరఫరాపై కూడా పడుతోంది. గడ్డకట్టే వర్షం వల్ల విద్యుత్ తీగలపై అంగుళం మందం వరకు మంచు పేరుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ తుఫాను సోమవారం వరకు కొనసాగి, న్యూయార్క్, బోస్టన్ వంటి ప్రధాన నగరాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. తుఫాను తీవ్రత తగ్గినప్పటికీ, ఆ తర్వాత కూడా ప్రమాదకరమైన చలి వాతావరణం కొనసాగుతుందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.
Latest News