|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 08:54 PM
ఛత్తీస్గఢ్లోని కోర్బా నగరంలో ఒక వింతైన, భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన 70 అడుగుల పొడవైన ఉక్కు వంతెనను దొంగలు రాత్రికి రాత్రే మాయం చేశారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కోర్బా నగరంలోని వార్డు నంబర్ 17 పరిధిలో ధోధిపారా ప్రాంతంలో హస్డియో లెఫ్ట్ కెనాల్పై ఉన్న ఈ స్టీల్ వంతెనను దుండగులు దొంగలించారు. అయితే ఇది ఆ మార్గంలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన వంతెనగా అధికారులు తెలిపారు.
జనవరి 18వ తేదీన ఆ పాత స్టీల్ బ్రిడ్జి కనిపించకపోవడంతో స్థానిక కార్పొరేటర్ లక్ష్మణ్ శ్రీవాస్.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి ఆ బ్రిడ్జి ఇనుప రెయిలింగ్లను కట్ చేసి.. ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా విడదీసి తరలించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వంతెన సుమారు 70 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు కలిగి ఉంది. దీని బరువు 10 టన్నుల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఈ చోరీలో 15 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. లోచన్ కేవట్, జైసింగ్ రాజపుత్, మోతీ ప్రజాపతి, సుమిత్ సాహు, కేశవపురి గోస్వామి అరెస్ట్ చేశారు. ముఖేష్ సాహు, అస్లాం ఖాన్ అనే సూత్రధారుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
నిందితుల అరెస్ట్, ఉక్కు స్వాధీనం చేసుకున్న పోలీసులు
నిందితుల నుంచి సుమారు 7 టన్నుల ఉక్కును స్వాధీనం చేసుకున్నట్లు సీఎస్ఈబీ పోలీస్ చౌకీ ఇన్ఛార్జ్ భీమ్సేన్ యాదవ్ తెలిపారు. చోరీ చేసిన ఉక్కును కాల్వ లోపలే దాచి ఉంచగా పోలీసులు గుర్తించారు. అలాగే దొంగతనానికి వాడిన వాహనాన్ని కూడా సీజ్ చేశారు. 4 దశాబ్దాల పాత వంతెన కావడంతో.. దాన్ని స్క్రాప్ కింద అమ్మేసుకోవడానికే తాము ఈ చోరీకి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
Latest News