|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:28 PM
రాయ్పూర్ వేదికగా జరిగిన భారత్–న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్కు ముందు ఒక్కసారిగా హీట్ పెరిగింది. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా , మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ మధ్య మైదానంలోనే మాటల యుద్ధం జరిగినట్టు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందే గ్రౌండ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాను మురళీ కార్తీక్ పలకరించారు. ఇద్దరూ చేతులు కలిపినా, వెంటనే హార్దిక్ అసహనం వ్యక్తం చేస్తూ కొన్ని మాటలు అన్నట్టు వీడియోలో కనిపించింది. దీనికి కార్తీక్ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా, హార్దిక్ మాత్రం మాటలు ఆపకుండా మాట్లాడినట్టు కనిపిస్తోంది. అయితే, ఇద్దరి మధ్య అసలు వివాదం ఏ విషయంపై జరిగిందన్నది అధికారికంగా వెల్లడికాలేదు. ఈ ఘటన మ్యాచ్ జరుగుతున్నంతసేపూ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వీడియోకి భారీ స్పందన వచ్చింది.
మ్యాచ్ విషయానికి వస్తే, హార్దిక్ పాండ్యాకు రెండో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా, మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 25 పరుగులిచ్చి ఒక కీలక వికెట్ తీశాడు. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 208 పరుగులు చేసిన నేపథ్యంలో హార్దిక్ గణాంకాలు మంచి ప్రభావం చూపించాయి. తొలి టీ20లో 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. గాయాల కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన హార్దిక్ తిరిగి రావడం భారత్కు అదనపు బలం అయ్యింది.
ఇక మ్యాచ్లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే చేధించి, ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది. ఈ ఛేజింగ్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించారు. కిషన్ 32 బంతుల్లో 76 పరుగులు చేయగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఇద్దరూ కలిసి మూడో వికెట్కు 48 బంతుల్లో 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను భారత్ వైపు తిప్పేశారు. తిలక్ వర్మ గాయంతో దూరంగా ఉన్న సమయంలో కిషన్ నుంచి వచ్చిన ఈ ఇన్నింగ్స్ జట్టు మేనేజ్మెంట్కు ఊరట ఇచ్చింది. అలాగే గత ఏడాది ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడిన సూర్యకుమార్ యాదవ్, 2026ను అద్భుతంగా ఆరంభించడం టీ20 వరల్డ్ కప్కు ముందు భారత్కు శుభసూచకంగా మారింది.
Latest News