|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:44 PM
గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమీర్గఢ్లోని ఇక్బాల్గఢ్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు, ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రక్కు ఢీకొన్న వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రికి తరలించిన తర్వాత ప్రాణాలు విడిచారు. గాయపడిన మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిసింది.ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద శబ్దం విన్న స్థానికులు, ఇతర వాహనదారులు అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. అమీర్గఢ్ పోలీసులు, వైద్య బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కారు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం కూడా లభించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడని, అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.
Latest News