|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 06:19 PM
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్లోకి రావడంపై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. సూర్య ఒక 'బిగ్ ప్లేయర్' అని, అతని ఫామ్ జట్టుకు ఎంతో మేలు చేస్తుందని అన్నాడు. స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్కు ముందు సూర్య లయ అందుకోవడం జట్టుకు చాలా కీలకమని అభిప్రాయపడ్డాడు.జియోహాట్స్టార్తో మాట్లాడుతూ రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.సూర్య లాంటి కీలక ఆటగాడు ఫామ్లో లేకపోతే జట్టు బ్యాటింగ్ లైనప్ బలహీనపడుతుంది. అతను నిలకడగా రాణించే ఆటగాడు. సూర్య తన అసాధారణ షాట్లతో ప్రత్యర్థి బౌలర్ల ప్రణాళికలను దెబ్బతీస్తాడు. బంతిని ఊహించని ప్రదేశాలకు తరలిస్తూ ఒత్తిడి పెంచుతాడు. అలాంటి ఆటగాడు ఫామ్లో ఉంటే జట్టు మొత్తం ఆత్మవిశ్వాసంతో ఉంటుంది అని వివరించాడు. ఇటీవలే న్యూజిలాండ్పై జరిగిన మ్యాచ్లో సూర్య 82 పరుగులతో అజేయంగా నిలిచి, దాదాపు 23 ఇన్నింగ్స్ల తర్వాత అర్ధశతకం నమోదు చేసిన విషయం తెలిసిందే.సూర్యకుమార్కు ఆటపై మంచి అవగాహన ఉందని రోహిత్ తెలిపాడు.ఐపీఎల్లో మేమిద్దరం కలిసి చాలా మ్యాచ్లు ఆడాం. ఆటలోని పరిస్థితులపై అతని స్పందన చాలా స్పష్టంగా ఉంటుంది. జట్టులోని ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసుఅని అన్నాడు.ఇదే సమయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ను కూడా రోహిత్ మెచ్చుకున్నాడు. అభిషేక్ కేవలం దూకుడుగా ఆడటమే కాదు, చాలా తెలివిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. పవర్ప్లేలో అతను ఇచ్చే మెరుపు ఆరంభాలు జట్టుకు సగం పని పూర్తి చేస్తాయి. బౌలర్లను ఎదుర్కోవడానికి అతను నెట్స్లో చాలా కష్టపడతాడు అని రోహిత్ పేర్కొన్నాడు. ప్రపంచకప్లో ఒత్తిడితో కూడిన క్షణాలు ఎదురైనా, వాటిని తట్టుకుని నిలబడే సత్తా భారత ఆటగాళ్లకు ఉందని ధీమా వ్యక్తం చేశాడు.
Latest News