|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 09:18 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో విరాళాల సేకరణ ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డిజిటల్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించింది. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలనుకునే దాతల కోసం APCRDA తన అధికారిక వెబ్సైట్ crda.ap.gov.in లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆన్ లైన్ విధానంలో విరాళాల సేకరణ కోసం సీఆర్డీఏ వెబ్సైట్లో 'Donate for Amaravati' అనే ఆప్షన్ తెచ్చారు. ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. అమరావతికి విరాళాలు అందించాలనుకునే దాతలు గూగుల్ పే, ఫోన్ పే లేదా పేటీఎం వంటి ఏదైనా UPI యాప్ ద్వారా ఈ కోడ్ను స్కాన్ చేసి నేరుగా సీఆర్డీఏ బ్యాంక్ ఖాతాకు నిధులను పంపవచ్చు.
'మై బ్రిక్ - మై అమరావతి ' స్ఫూర్తితో..
మరోవైపు గతంలోనూ అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. 2015లో రాజధాని నిర్మాణం కోసం'మై బ్రిక్ - మై అమరావతి' (My Brick - My Amaravati) కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పట్లో ఒక్కో ఈ-ఇటుక ధరను రూ. 10 గా నిర్ణయించగా, సామాన్యుల నుంచి సంపన్నుల వరకు వేలాది మంది స్పందించారు. ఎన్నారైలు సైతం ఈ - ఇటుకలను కొనుగోలు చేసి అమరావతి పట్ల తమ మమకారాన్ని చాటుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే స్ఫూర్తిని రగిలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
వేగంగా సాగుతున్న అమరావతి పనులు
మరోవైపు ప్రస్తుతం అమరావతిలో తొలి విడత నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అటు కేంద్రం నుంచి, ప్రపంచ బ్యాంకు ద్వారా అమరావతికి రూ. 15,000 కోట్ల నిధులు అందుతున్నాయి. అలాగే ఏడీబీ వంటి బ్యాంకుల నుంచి కూడా రుణాలు స్వీకరిస్తు్న్నారు. అలాగే ఇటు ప్రజల నుంచి వచ్చే విరాళాలను కూడా రాజధాని మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్మిస్తు్న్నన అమరావతి ప్రజా రాజధానికి ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.