|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 10:21 PM
టీమిండియా లెజెండ్రీ క్రికెటర్ రోహిత్ శర్మ , మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించనుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ అవార్డులు అందుకోనున్న క్రీడాకారుల జాబితాలో వీరికి చోటు దక్కాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
కేంద్ర హోంశాఖ విడుదల చేసిన 131 మంది పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో మొత్తం తొమ్మిది మంది క్రీడాకారులు ఉన్నారు. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్కప్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. హర్మన్ప్రీత్ సారథ్యంలో ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ను భారత్ దక్కించుకుంది.
ఈ ఏడాది క్రీడారంగంలో పద్మభూషణ్ అవార్డు అందుకునే ఏకైక వ్యక్తిగా భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్రాజ్ నిలిచాడు. భారత టెన్నిస్ను 1970, 80 దశకాల్లో కొత్త స్థాయికి తీసుకెళ్లిన అమృత్రాజ్ భారత డేవిస్ కప్ జట్టును 1974, 1987 సంవత్సరాల్లో ఫైనల్స్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే 1984లో పద్మశ్రీ, 1974లో అర్జున అవార్డులు అందుకున్న ఆయనకు ఇది మరో గౌరవప్రదమైన గుర్తింపుగా నిలవనుంది.
పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్కు కూడా పద్మశ్రీ అవార్డు లభించనుంది. అంతేకాకుండా భారత రెజ్లింగ్ రంగంలో అనేక ఒలింపిక్ మెడలిస్టులను తయారు చేసిన ప్రఖ్యాత కోచ్ వ్లాదిమిర్ మెస్త్విరిశ్విలి, మహిళల హాకీ జట్టు గోల్కీపర్ సవితా పూనియా, మాజీ హాకీ ఆటగాడు బల్దేవ్ సింగ్, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు కె. పాజనివేల్, బుండేల్ఖండ్ ప్రాంతానికి చెందిన బుండేలీ యుద్ధకళ పరిరక్షకుడు భగవాన్దాస్ రాయ్క్వార్ తదితరులకు కూడా పద్మశ్రీ పురస్కారం దక్కింది.
పద్మ అవార్డుల జాబితా వెలువడిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. “దేశానికి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. వారి ప్రతిభ, అంకితభావం, సేవా దృక్పథం మన సమాజానికి గర్వకారణం” అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Latest News