|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 05:05 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలని పట్టుబట్టిందో బాలిక. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన తండ్రి పడిన కష్టాన్ని తెలుసుకున్న తొమ్మిదేళ్ల అంధ బాలిక స్వాతి అన్నపూర్ణ.. ఆయన్ను కలవాల్సిందేనని స్కూల్కు వెళ్లనని పట్టు పట్టింది. పవన్ కళ్యాణ్ను కలిసి దేశభక్తి గీతం, హనుమాన్ చాలీసా పాడే వరకు తాను పాఠశాలకు వెళ్లనని తేల్చి చెప్పింది. విశాఖలోని భీమిలి నేత్రా విద్యాలయంలో తొమ్మిదేళ్ల అంధ బాలిక స్వాతి అన్నపూర్ణ నాలుగో తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి తన కోరిక తీర్చాలని ఇంట్లోనే ఉండిపోయింది. గతంలో స్వాతి తండ్రి పవన్ కళ్యాణ్ను కలిసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
యు.కొత్తపల్లి మండలం ముమ్మిడివారిపోడు గ్రామానికి చెందిన నల్లా ఏసుబాబు, రాణి దంపతుల పెద్ద కుమార్తె స్వాతి అన్నపూర్ణ. ఈమె పుట్టుకతోనే అంధురాలు. పవన్ కళ్యాణ్కు హనుమాన్ అంటే ఇష్టమని తెలుసుకున్న స్వాతి.. హనుమాన్ చాలీసాను సాధన చేసింది. పవన్ గెలుపు కోసం తన తండ్రి పడిన కష్టాన్ని గుర్తుచేసుకుని.. పవన్ కళ్యాణ్ను కలిసి తాను నేర్చుకున్న దేశభక్తి గీతం, హనుమాన్ చాలీసా వినిపించాలని ఆమె కోరుకుంటోంది. ఈ కోరిక తీరే వరకు పాఠశాలకు వెళ్లేది లేదని ఆమె మొండికేసింది. స్వాతి తండ్రి నల్లా ఏసుబాబు తన కుమార్తె కోరిక తీర్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాలిక కోరిక తీర్చడానికి ఆమె తండ్రి నల్లా ఏసుబాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తన కుమర్తె పవన్ కళ్యాణ్ను కలిసే అవకాశం కల్పించాలని ఆయన వేడుకుంటున్నారు. తన కుమార్తెకు ఇది ఒక పెద్ద కల అని, అది నెరవేరితే ఆమె ఎంతో సంతోషిస్తుందని ఆయన అంటున్నారు.
చిన్నారి స్వాతి అన్నపూర్ణ కోరికను తీర్చేలా జనసేన కార్యకర్తలు కానీ, అధికారుల కానీ స్పందించి అపాయింట్మెంట్ వచ్చేలా చూడాలంటున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని స్వాతి తండ్రి ఏసుబాబు కోరుతున్నారు. మరి ఆమె కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.