ప్రేమ వివాహం చేసుకుంటే ఊరి నుంచి బహిష్కరణ
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 05:33 PM

ఆధునిక యుగంలోనూ కొన్ని ప్రాంతాల్లో పాత కాలపు ఆలోచనలు రాజ్యమేలుతున్నాయి. నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడం నేరమన్నట్లుగా భావిస్తున్న.. మధ్య ప్రదేశ్‌లోని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా గ్రామస్థ లంతా కలిసి 'ప్రేమ వివాహాలకు' వ్యతిరేకంగా ఒక అమానుషమైన తీర్మానాన్ని ఆమోదించారు. ఊర్లో ఎవరు ప్రేమ పెళ్లి చేసుకున్నా వారి కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించాలని తీర్మానించారు.


ఏమిటా ‘గ్రామ శాసనం’?


మధ్య ప్రదేశ్‌లోని రత్లాం జిల్లా పాంచేవా గ్రామస్థులంతా కలిసి ఓ తీర్మానాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో.. గ్రామస్థులందరూ పెద్ద ఎత్తున గుమిగూడి ఉన్నారు. ఒక యువకుడు ఈ 'గ్రామ శాసనాన్ని' గట్టిగా చదివి వినిపించాడు. దీని ప్రకారం.. ఎవరైనా యువతీ యువకులు తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా, తమకు నచ్చిన వారిని ప్రేమ పెళ్లి చేసుకుంటే.. ఆ తప్పుకు వారి కుటుంబాలను సామాజికంగా బహిష్కరిస్తారు. ఈ బహిష్కరణ ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. బహిష్కరణకు గురైన కుటుంబాలకు పాలు, నిత్యావసర వస్తువుల సరఫరా నిలిపివేస్తారు.


అలాగే ఆ కుటుంబం నుంచి ఎవరినీ పనిలోకి తీసుకోకూడదు. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులు ఇతరుల దగ్గర పని చేయడానికి వీళ్లేదు. ఊరిలో జరిగే శుభకార్యాలకు కూడా వారిని పిలవరు. ఆ కుటుంబాలకు ఎవరైనా ఆశ్రయం కల్పించినా లేదా మద్దతుగా నిలిచినా వారిపై కూడా అదే స్థాయిలో చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రేమ పెళ్లి చేసుకున్న మూడు కుటుంబాలను గ్రామం నుంచి వేలివేశారు. అంతేకాదండోయ్.. ఈ వీడియోలో ఆ ముగ్గురు కుటుంబ పెద్దల పేర్లను బాహాటంగా ప్రస్తావించారు.


భారత రాజ్యాంగం ప్రకారం.. 18 ఏళ్లు నిండిన మహిళ, 21 ఏళ్లు నిండిన పురుషుడు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్నారు. ఇలాంటి పంచాయితీ తీర్పులు, గ్రామ శాసనాలు చెల్లవని.. సామాజిక బహిష్కరణలు చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది.అయితే తాజాగా పాంచేవా గ్రామస్థుల తీర్మానానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జనపద్ సీఈఓ, స్థానిక అధికారులు పాంచేవా గ్రామాన్ని సందర్శించారు. ఇలాంటి బహిష్కరణలు చట్టరీత్యా నేరమని, రాజ్యాంగ విరుద్ధమని గ్రామస్థులకు వివరించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్డీఓపీ సందీప్ మాలవీయ తెలిపారు. మరోవైపు గ్రామాల్లోని ఇలాంటి మూఢాచారాలు, అక్రమ తీర్మానాలపై పోలీసులు నిఘా పెంచారు.

Latest News
Karnataka HC quashes defamation case against Rahul Gandhi Tue, Feb 17, 2026, 03:45 PM
T20 WC: Rain delays Zimbabwe vs Ireland toss in Pallekelle Tue, Feb 17, 2026, 03:43 PM
Decision taken, CM will inform people at right time: Shivakumar on Karnataka leadership issue Tue, Feb 17, 2026, 03:36 PM
Bolivia's Vice President arrives in India to attend AI Impact Summit Tue, Feb 17, 2026, 03:00 PM
Pakistan: Police arrests 35 Afghan migrants during raids in Peshawar Tue, Feb 17, 2026, 02:55 PM