|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:24 PM
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు రాష్ట్ర పర్యటన సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. మీకు సమాచారం ఇచ్చే వారు తప్పుగా ఇస్తున్నట్టున్నారు" అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో మహిళలకు రక్షణ లేదని, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని ప్రధాని చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.తమిళనాడు యువత మాదకద్రవ్యాల బారిన పడుతోందన్న ప్రధాని విమర్శపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. "భారతదేశంలోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రధానికి తెలియదా? గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పోర్టుల నుంచే టన్నుల కొద్దీ డ్రగ్స్ దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. మీ రాష్ట్రాల్లో ఉన్న గేట్వేలను అడ్డుకోకుండా, మా రాష్ట్రంపై నెపం వేయడం సరికాదు" అని మండిపడ్డారు. డ్రగ్స్ నెట్వర్క్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, కానీ కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కావడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు.తమిళనాడులో మహిళలు భయం గుప్పెట్లో ఉన్నారన్న మోదీ వ్యాఖ్యలకు స్టాలిన్ తన ఎక్స్ వేదికగా బదులిచ్చారు. మహిళల సంక్షేమం, భద్రత విషయంలో తమిళనాడు దేశంలోని అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మెరుగైన స్థానంలో ఉందని గుర్తుచేశారు. జయలలిత పాలనను ప్రశంసిస్తూ ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించిన మోదీ తీరును తప్పుబడుతూ.. తాము మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన 'మహిళా ఉచిత బస్ పాస్', 'కలైంజ్ఞర్ మగలిర్ ఉరిమై తొగై' వంటి పథకాలను వివరించారు.
Latest News