|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 07:00 PM
ఏపీలోని పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పథకమైన అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలో 70కి పైగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో.. తుని రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంది. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద తుని రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లు అభివృద్ధి చేశారు. అలాగే కొత్తగా మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. ప్రయాణికులు నిరీక్షించేందుకు నిర్మించిన వెయిటింగ్ హాళ్లను ఆధునిక టాయిలెట్లతో అప్ గ్రేడ్ చేశారు. తుని రైల్వే స్టేషన్ ముఖద్వారంతో పాటుగా స్టేషన్ ప్రాంగణాన్ని రీ డిజైన్ చేశారు. దీంతో తుని రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోయాయని రైల్వే ప్రయాణికులు చెప్తున్నారు. అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ ఫోటోలను భారతీయ రైల్వే ఎక్స్ వేదికగా పంచుకుంది.
మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏపీలోని 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.2,051 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తుని రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఈ పథకం కింద రూ.19.13 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ నిధులతో కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, స్టేషన్ ఎంట్రీ రీ డిజైన్, రైల్వే స్టేషన్ ఆవరణలో పనులు చేపట్టారు. తుని రైల్వే స్టేషన్లోని ఒకటీ, రెండు ప్లాట్ఫామ్లను కలుపుతూ కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. ప్రధాన ద్వారం నుంచి కాకుండా బయటి వ్యక్తులు రైల్వే స్టేషన్లోకి రాకుండా కాంపౌడ్ వాల్ నిర్మిస్తున్నారు. పనులు దాదాపుగా పూర్తికావటంతో స్టేషన్ కొత్త శోభను సంతరించుకుంది.
మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో కొత్త భవనాల నిర్మాణంతో పాటుగా ప్రయాణికులకు వీలుగా ఉండేందుకు లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్ వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఫుడ్ కోర్టులు, షాపింగ్ కాంప్లెక్సులు, టాయిలెట్లు, వెయిటింగ్ హాళ్ల నిర్మాణం చేపడుతారు. అలాగే లగేజీ భద్రపరుచుకునే గదులు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తారు. డిజిటల్ బోర్డులు, సీసీ కెమెరాలు, వైఫై సౌకర్యం వంటి ఏర్పాట్లు చేస్తారు. ఈ క్రమంలోనే ఈ పథకం కింద ఏపీలోని ప్రధాన రైల్వే స్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది.
తుని రైల్వే స్టేషన్లో కొత్త రైళ్లకు హాల్ట్
మరోవైపు తుని రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్, ఎల్టీటీ, ఏపీ ఎక్స్ ప్రెస్ వంటి రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే హాల్ట్ కల్పించింది. ఇటీవలే ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నెల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాకినాడ, కోనసీమ ప్రాంత వాసులకు ఉపయోగం ఉంటుంది.