|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 07:08 PM
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వాఖ్యలు చేశారు. మారుతున్న కాలంతో పాటు పార్టీలోనూ మార్పులు రావాలన్నారు. పేదరికం లేని సమాజం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని.. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పార్టీలో మహిళలను గౌరవించాలని చెప్పారు. ఈ మేరకు ఈ శిక్షణా తరగతులకు ఇటీవల నియమించిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
శిక్షణా కార్యక్రమం సందర్భంగా పార్టీ నేతలకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉంది కాబట్టి.. పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించామన్నారు లోకేశ్. భేషజాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. " ఈ కమిటీల్లో 83 శాతం మంది కొత్తవారికి స్థానం కల్పించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో.. మనమంతా ఆయన సైనికులం. తోట చంద్రయ్య, మంజుల, అంజిరెడ్డి లాంటి ఎందరో కార్యకర్తలు మనకు స్ఫూర్తిదాయం. మాట మార్చడం, మడమ తిప్పడం తెలుగు దేశం పార్టీ రక్తంలోనే లేదు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా చంద్రబాబు నడిపిస్తున్నారు. ప్రజలకు సేవ, కార్యకర్తలకు సాయం చేయాలని నిరంతరం తపించే నాయకుడు చంద్రబాబు. అయితే మన పార్టీ యువతకు సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరముంది." అని లోకేశ్ అన్నారు.
కాలంతో పాటు పార్టీలోనూ మార్పులు రావాలి..
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి లోకేశ్ తెలిపారు. కూటమి అన్నప్పుడు విభేదాలు ఉంటాయని.. ఇలాంటి సమస్యలను పార్లమెంట్ కమిటీల్లోని నాయకులు పరిష్కరించాలని సూచించారు. అంతేకాకుండా పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తారని అన్నారు. "మనమందరం కలసికట్టుగా ముందుకెళ్లాలి. నియోజకవర్గాల్లో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యత.. ఆ గ్రామ అధ్యక్షుడి నుంచి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిపై ఉంటుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పనిచేయడం ఛాలెంజింగ్గా ఉంటుంది. అందుకే మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీలో మార్పు జరగాల్సిన అవసరం ఉంది" అని లోకేశ్ వివరించారు.
కార్యకర్తలకు శిక్షణ
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే తాము ఉన్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం కోసం.. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో రీజినల్ సెంటర్లను ఏర్పాటుచేస్తామని లోకేశ్ తెలిపారు.
Latest News