|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 07:12 PM
విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థుల అర్హతకు తగిన విధంగా కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. శుక్రవారం రోజున 27 మందికి విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. ఏపీ జెన్కో, ట్రాన్స్కో సహా విద్యుత్ శాఖకు సంబంధించిన పలు సంస్థలలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గొట్టిపాటి రవికుమార్ .. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోలో మూడు నెలలకు ఓసారి కారుణ్య నియామకాల ప్రక్రియ చేపడుతున్నామన్నారు.
మరోవైపు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై గొట్టిపాటి రవికుమార్ విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో కారుణ్య నియామకాల కింద అర్హత మేరకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఉన్నత విద్య అభ్యసించిన వారికి కూడా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా.. అభ్యర్థి అర్హతకు తగినట్లుగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాల కింద 600 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. కారుణ్య నియామకాల భర్తీలో ఎలాంటి ఆలస్యం జరగకుండా.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు విద్యుత్ శాఖ పరిధిలో ఉన్న సంస్థలలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు చేపడుతున్నామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరుగుతోందన్నారు. కారుణ్య నియామకాల కోసం సంవత్సరం లోపు దరఖాస్తు చేయనివారికి కూడా.. నిబంధనలు సడలించి ఉద్యోగాలు ఇస్తున్నామని వివరించారు.
ఉద్యోగుల యోగక్షేమాలు, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. ప్రమాదాలకు గురైన ఉద్యోగులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల్లో చేరిన వారు.. తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగంలో ముందుకెళ్లాలని సూచించారు.