|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 08:15 PM
మహారాష్ట్ర రాజకీయాలు దేశంలో ఎప్పుడూ సంచలనం రేపుతూనే ఉంటాయి. పార్టీల చీలికలు.. కొత్త కూటములు కుంపట్లు.. నేతల పార్టీల మార్పులు.. అధికార కూటమి బలం తగ్గిపోయి.. అధికారం కోల్పోయి కొత్త కూటమి పగ్గాలు చేపట్టడం వంటి అనేక రకాల పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. అయితే 2023లో ఎన్సీపీ రెండుగా చీలిపోయి.. శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గంగా రెండు పార్టీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్.. బీజేపీ, షిండే శివసేన కూటమిలో చేరి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే కొద్ది రోజుల క్రితం మళ్లీ రెండు వర్గాలు కలవాలనే చర్చలు జరుగుతున్న వేళ.. బారామతిలో జరిగిన విమాన ప్రమాద ఘటనలో అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు.
ఈ క్రమంలోనే అజిత్ పవార్ చనిపోయినప్పటికీ.. రెండు వర్గాలు కలిసిపోవాలనే నిర్ణయాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్లాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయిన తర్వాత.. రెండు పార్టీలు కలిసిపోనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్సీపీ ఒక్కటైతే దానికి అధ్యక్షుడు ఎవరు ఉండాలి అనేది కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎన్సీపీ చీఫ్ రేసులో నలుగురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. శరద్ పవార్ వర్గం నుంచి శరద్ పవార్.. ఆయన కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలే పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు.. అజిత్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ , సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ పేర్లు అధ్యక్షుడి రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.
ఇక రెండు వర్గాల సీనియర్ నేతలు వెల్లడించిన వివరాల ప్రకారం.. అజిత్ పవార్, శరద్ పవార్ ఇప్పటికే రెండు పార్టీలను కలిపేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి డిసెంబర్, జనవరి నెలల్లోనే పలుమార్లు సమావేశమైనట్లు తెలిపారు. మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల తర్వాత బాబాయ్, అబ్బాయ్ కలిసి జాయింట్ ప్రెస్మీట్ నిర్వహించి.. ప్రకటన చేయాలని కూడా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం రెండు వర్గాలకు చెందిన నేతలు సమావేశమై.. పార్టీల విలీనానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న శరద్ పవార్.. 1999లో బయటికి వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 2023 జులైలో శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి మహాయుతి కూటమికి మద్దతు పలికి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు. ఇందుకోసం అజిత్ పవార్కు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి దక్కింది. శరద్ పవార్కు అత్యంత సన్నిహితులైన ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్ వంటి కీలక నేతలు కూడా అజిత్ వర్గంలో చేరిపోయారు.