|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 08:21 PM
భారత క్రీడా దిగ్గజం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పి.టి. ఉష కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త 64 ఏళ్ల వెంగలిల్ శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కేరళలోని కోజికోడ్లో కన్నుమూశారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఉష ఇంట్లో లేరు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడం కోసం ఆమె ఇంటికి దూరంగా ఉన్నారు. పి.టి. ఉష సాధించిన ప్రతి విజయం వెనుక ఉండి.. ఆమెను ముందుకు నడిపించిన ఆయన ఇక లేరన్న వార్త క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీనివాసన్ కోజికోడ్ జిల్లాలోని థిక్కోడి పెరుమాళ్పురంలో ఉన్న తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ను పెరుమాళ్పురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనివాసన్.. పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తిగా ఉష క్రీడా అకాడమీ, ఆమె బాధ్యతల నిర్వహణలో తోడుగా ఉంటూ వచ్చారు. ఎప్పుడూ ఆమె వెన్నంటే ఉంటూ భార్యకు అన్ని విధాలుగా అండగా నిలిచారు.
కేరళలోని పెన్నని సమీపంలో కుట్టిక్కడ్కు చెందిన నారాయణన్, సరోజినీ దంపతులు శ్రీనివాసన్ తల్లిదండ్రులు.సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో డిప్యూటీ ఎస్పీ హోదాలో ఆయన రిటైర్ అయ్యారు. తన దూరపు బంధువైన పీటీ ఉషను1991లో శ్రీనివాసన్ వివాహం చేసుకున్నారు. వారికి డాక్టర్ ఉజ్వల్ విగ్నేష్ అనే కుమారుడు ఉన్నారు.
ఉషకు వెన్నెముకగా శ్రీనివాసన్..
పి.టి. ఉష అంతర్జాతీయ స్థాయిలో 'పయ్యోలి ఎక్స్ప్రెస్'గా గుర్తింపు పొందడంలో శ్రీనివాసన్ పాత్ర వెలకట్టలేనిది. వారు వివాహం చేసుకున్న నాటి నుంచి ఆమె క్రీడా జీవితంలోనే కాకుండా తదనంతరం ఆమె రాజకీయ ప్రస్థానంలోనూ శ్రీనివాసన్ వెన్నంటే నిలిచారు. ఉష సాధించిన ప్రతీ మైలురాయి వెనుక ఆయన ప్రోత్సాహం ఉండేదని సన్నిహితులు చెబుతుంటారు. "ఆయన కేవలం భర్త మాత్రమే కాదు.. ఉషకు ఒక బలమైన పిల్లర్" అని క్రీడా విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. ముఖ్యంగా ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ స్థాపనలో, వర్ధమాన క్రీడాకారులకు శిక్షణను ఇవ్వడంలో ఆయన తెర వెనుక ఉండి ఎంతో కృషి చేశారు.
పలువురు ఒలింపియన్లు, అథ్లెట్లు, రాజకీయ ప్రముఖులు శ్రీనివాసన్ మృతి పట్ల ఉషకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం పిటి ఉషతో మాట్లాడారు. శ్రీనివాసన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు.
Latest News