|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 08:25 PM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ మరణంతో బారామతిలో రాజకీయ అడ్డుగోడలు కూలిపోయి, పవార్ కుటుంబంలో ఐక్యతకు సంబంధించిన హృద్యమైన కథ వెలుగులోకి వచ్చింది. ఎన్నికలలో 'పవార్ వర్సెస్ పవార్' పోరాటాలను ప్రపంచం చూస్తున్నప్పటికీ.. నేటి వాస్తవ పరిస్థితి దానికి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించింది. ఎన్నికల్లో 'పవార్ వర్సెస్ పవార్' పోరు ప్రపంచాన్ని ఆకర్షించినా, ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత అందరినీ ఆకట్టుకుంటోంది. అజిత్ పవార్ మరణ వార్త తెలిసినప్పటి నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తన వదిన సునేత్రా పవార్ వెన్నంటే ఉన్నారు. తన భర్త మృతదేహాన్ని తీసుకుని బారామతికి వచ్చినప్పుడు, ఆమె ఒంటరిగా రాలేదు. మరదలు సుప్రియా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, జనాల మధ్య, కెమెరాల మధ్య నడిపించారు.
రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర గవర్నర్, ఉప-ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వంటి ప్రముఖులు సంతాపం తెలిపినప్పుడు సుప్రియానే సునేత్రకు అండగా నిలిచారు. సుప్రియా తన వదినకు ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచి, ఆమెకు ధైర్యం చెప్పారు. అజిత్ పవార్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచినప్పుడు ఆ దృశ్యం చాలా భావోద్వేగానికి గురిచేసింది. కుటుంబ సభ్యులను, జనసందోహాన్ని సుప్రియా సమన్వయం చేస్తూ, వేదికపై నుంచి ప్రకటనలు కూడా చేశారు. మన 'దాదా' (అజిత్ పవార్) ఎప్పుడూ పాటించే క్రమశిక్షణను పాటించాలని ఆమె భారీ జనసమూహాన్ని కోరారు.
గురువారం జరిగిన అంత్యక్రియల్లోనూ లోక్సభ ఎన్నికల్లో వారిద్దరూ పోటీ పడిన రాజకీయ వైరం ఎక్కడా కనిపించలేదు. పూజారులు మతపరమైన 'విధి' (సంప్రదాయాలు) నిర్వహించడానికి సునేత్రను పిలిచినప్పుడు, సుప్రియా ఆమెను దగ్గరగా పట్టుకుని, ప్రతి అడుగులోనూ మార్గనిర్దేశం చేశారు. అంత్యక్రియల సమయంలో సునేత్ర పూజ తాంబూలం పళ్లెం పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె చేతులు దుఃఖంతో వణికిపోయారు. అప్పుడు కూడా సుప్రియా ఆ తాంబూలాన్ని పట్టుకుని, సునేత్రతో పూజ చేయించారు.
అంత్యక్రియల్లో భాగంగా చితి చుట్టూ సునేత్రా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు సైతం సుప్రియా ఆమెతోనే ప్రతి క్షణం నడిచారు. మెట్లు ఎక్కడంలో, దిగడంలో సహాయం చేస్తూ, ఆమె చేతిని ఒక్క క్షణం కూడా వదలకుండా తోడుగా నిలిచారు. ఏడాది కిందట లోక్సభ ఎన్నికల్లో సుప్రియా, సునేత్రను రికార్డు మెజారిటీతో ఓడించిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అజిత్ పవార్ తన మేనల్లుడు యుగేంద్రను ఎదుర్కొన్నారు. మూడేళ్ల కిందట బాబాయి నాయకత్వంలోని ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే.
Latest News