|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:23 PM
తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసిందంటూ కావాలనే సాగించిన దుష్ప్రచారం పూర్తిగా అసత్యమని రుజువైన నేపథ్యంలో, ఈరోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల దేవస్థాన పవిత్రతను అపఖ్యాతికి గురిచేసేలా సాగిన అసత్య ప్రచారాలు ఇకనైనా ఆగిపోవాలని, సత్యమార్గంలో నడవాలని కూటమి నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని ఆయన భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ, కోట్లాది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి తిరుమల క్షేత్ర గౌరవాన్ని దెబ్బతీయడం అత్యంత దుర్మార్గమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాలను, దేవుడిని కూడా వదలకుండా దుష్ప్రచారాలు చేయడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, తమ నివాసం వద్దనే శ్రీ వేంకటేశ్వర స్వామికి పరిహార పూజలు నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ భక్తి, విశ్వాసం తగ్గలేదని, ఈ పూజలు తిరుమల పవిత్రత పరిరక్షణకే అంకితమని అన్నారు.
Latest News