|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 07:21 PM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు గుంటూరులో నిప్పు రాజేశాయి. అయితే తన వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించి చేసినవి కావని..తనను తిట్టినవారిని, కోపంలో అలా అనేశానని, మధ్యలో చంద్రబాబు పేరు వచ్చిందంటూ అంబటి రాంబాబు వివరణ కూడా ఇచ్చారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం అంబటి రాంబాబు వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి వద్ద శనివారం సాయంత్రం ఉద్రిక్తత తలెత్తింది.
చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు గుంటూరు నవభారత్ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది రాళ్లు రువ్వారు. మరికొంతమంది అంబటి రాంబాబు ఇంట్లోకి దూసుకెళ్లారు. అంబటి రాంబాబు ఇంట్లోని కారు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలు, పూలకుండీలు పగలగొట్టారు. ఈ సమయంలో అంబటి రాంబాబు పార్టీ కార్యాలయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంబటి రాంబాబు ఇంటిపై దాడితో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.
టీడీపీ కార్యకర్తలు, మహిళలను వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే ఇందుకు నిరాకరించిన టీడీపీ శ్రేణులు.. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పేవరకూ వెనక్కి వెళ్లేది లేదంటూ భీష్మించుకున్నారు. అంబటి రాంబాబు ఇంటి ముందు నిరసన తెలియజేశారు. దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు టీడీపీ మహిళా విభాగానికి పోటీగా వైసీపీ మహిళా విభాగం కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకోవటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరు పక్షాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అసలేమైందంటే..
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరు గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి. మహాపాపం పేరుతో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా.. దీనిని తొలగించాలని, లేకుంటే తామే తొలగిస్తామని అంబటి రాంబాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజల అనంతరం అంబటి రాంబాబు.. అటుగా రావటంతో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా.. చంద్రబాబుపై అంబటి రాంబాబు సహనం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీడియో వైరల్ అవుతోంది.
Latest News