|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 09:12 PM
కృత్రిమ మేథ (AI) దూకుడుతో ప్రపంచానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయి. అయితే అదే సమయంలో దాని వల్ల ఏర్పడుతున్న ముప్పు మాత్రం మరింత వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే డీప్ఫేక్లు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో ఏఐ కలకలం సృష్టిస్తుండగా,ఇప్పుడు వీటిని మించిన ప్రమాదం ప్రపంచాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఈసారి ఏకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లనే ఆక్రమించి, తప్పుడు వాదనలు ప్రచారం చేస్తూ ప్రభుత్వాలను కూల్చే స్థాయిలో ప్రమాదం ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది.
*సోషల్ మీడియాతో ప్రజాస్వామ్యంపై దాడి (AI Swarms) : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆక్రమించి, తప్పుడు కథనాలను విస్తృతంగా వ్యాప్తి చేయడం, యూజర్లను వేధించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను అణగదొక్కే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం హెచ్చరించింది. ఈ ఏఐ సమూహాలు సమాచార యుద్ధంలో కొత్త ఫ్రంట్గా మారే అవకాశం ఉందని, మానవ ప్రవర్తనను అనుకరించే సామర్థ్యం వీటికి ఉందని ‘సైన్స్’ జర్నల్లో ప్రచురితమైన తాజా పాలసీ ఫోరమ్ పేపర్ వెల్లడించింది.
*చౌకగా అబద్ధాల సృష్టి : ఈ ఏఐ ఏజెంట్లు గతంలో ఉన్న సాధారణ బాట్లలా కాకుండా, రియల్ టైమ్లో పరస్పరం సమన్వయం చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా స్పందించగలవని పరిశోధకులు తెలిపారు. ఒకే కథనాన్ని వివిధ ప్లాట్ఫామ్లలో వేలాది ఖాతాల ద్వారా నిరంతరం కొనసాగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.జనరేటివ్ ఏఐ టూల్స్ విశ్వసనీయతను పెద్దగా కోల్పోకుండా ప్రచార అవుట్పుట్ను విస్తరించగలవని, మనుషులు రాసిన వాటికంటే మరింత నమ్మకంగా కనిపించే అబద్ధాలను తక్కువ ఖర్చుతో సృష్టించగలవని అధ్యయనం పేర్కొంది. ఏఐ లాజిక్ను మెరుగుపర్చేందుకు ఉపయోగించే ‘చైన్-ఆఫ్-థాట్ ప్రాంప్టింగ్’ వంటి టెక్నాలజీలు, భవిష్యత్తులో తప్పుడు కథనాల తయారీకి మరింత ప్రమాదకరంగా మారవచ్చని కూడా హెచ్చరించింది.
*గుర్తించడం కూడా కష్టమే : ఈ ఏఐ దాడులను గుర్తించడం చాలా కష్టంగా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల అవి ఎంత స్థాయిలో వ్యాప్తి చెందాయో అంచనా వేయడం కూడా కష్టమవుతుందని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడానికి పూర్తిగా ఆటోమేటెడ్ అనుమతులకంటే, ఆచరణాత్మకమైన నియంత్రణ విధానాలపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు.ఇదే సమయంలో ‘మోల్ట్బుక్’ అనే కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆవిర్భావం కూడా ఈ హెచ్చరికలకు కారణమైంది. ఈ ప్లాట్ఫామ్లో ఏఐ ఏజెంట్లే కంటెంట్ను పంచుకుంటాయి, వాటిపైనే చర్చ జరుగుతుంది. మనుషులకు కేవలం గమనించే అవకాశం మాత్రమే ఉంటుంది; వారు పోస్ట్ చేయలేరు. ఈ ప్లాట్ఫామ్ను మాట్ ష్లిచ్ట్ తన ఏఐ అసిస్టెంట్ సహాయంతో రూపొందించారు. దీని కోసం తాను ఒక్క లైన్ కోడ్ కూడా రాయలేదని ష్లిచ్ట్ వెల్లడించారు.