|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 11:46 AM
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగానే ఉందని, రాష్ట్రానికి దీని వల్ల ఒరిగిందేమీ లేదని రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలవరానికి కేవలం రూ.3,300 కోట్లు మాత్రమే విదిల్చారని, అంతకు మించి రాష్టానికి ఒరిగిందేమీ లేదన్నారు. అప్పులు మాత్రం జీడీపీలో 4.3 శాతానికి తగ్గించుకున్నారని, కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం గత బడ్జెట్లో చెప్పిన దాని కన్నా ఇప్పటికే రూ.16 వేల కోట్లు ఎక్కువగా అప్పులు చేసిందని ఆక్షేపించారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో అప్పులు చేస్తే శ్రీలంక అయిపోతుందన విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడేమంటారని బుగ్గన ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ చరిత్రలోనే అతి పెద్దది. ఇందులో ఆదాయ, వ్యయ అంచనాలు రూ.53,47,315 కోట్లు కాగా, రూ.16,95,768 కోట్లు అప్పుగా చూపారు. మూలధన వ్యయం రూ.12,21,821 కోట్లుగానూ, ద్రవ్యలోటు రూ.16,95,765 కోట్లుగానూ చూపారు. జీడీపీలో గత సంవత్సరాలతో పోలిస్తే అప్పు 4.3 శాతానికి తగ్గడం ఒక్కటే ఊరట. సమగ్ర శిక్ష, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలకు భారీ కేటాయింపులు చేసినా ఖర్చు మాత్రం చేయడం లేదు. గతేడాది జల్ జీవన్ మిషన్కు రూ.67 వేల కోట్లకు పైగా కేటాయించినా, కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అందులో ఏపీలోనే ప్రభుత్వం రూ.12 వేల కోట్లు అప్పులు చేసి ఖర్చు పెట్టడం విశేషం. రోడ్లు, రైలు మార్గాలకు రూ.5,98,520 కోట్లు ఖర్చుపెడతామని ప్రకటించారు. పోలవరానికి కేవలం రూ.3,300 కోట్లు మాత్రమేఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా ప్రాజెక్టుల ఊసే లేదు అని తెలిపారు.
Latest News