|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 11:47 AM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు, నేతలు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడటం అత్యంత దారుణమని మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లా వైయస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, దాడులు చేయడం కూటమి ప్రభుత్వ పాలనలో పరిపాటిగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గాడితప్పి ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. కల్తీ నెయ్యి అంశంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసిన నేపథ్యంలో సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని, ఆ ఫ్రస్టేషన్తోనే డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అంబటి రాంబాబు గారిపై దాడులు, అక్రమ కేసులు పెట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. ధైర్యంగా మాట్లాడుతున్నాడనే ఒక్క కారణంతో రాంబాబు గారిని టార్గెట్ చేసి, కర్రలు, రాడ్లతో దాడి చేశారని తెలిపారు. అనంతరం లేనిపోని అపోహలు సృష్టించి ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపాలనే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. అంబటిపై హత్యాయత్నం జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం తీవ్రంగా ఆక్షేపనీయమన్నారు. మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డా. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలుకావడం లేదని, నారా వారి రెడ్బుక్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. కేసులు, జైలుకు భయపడకుండా రాంబాబు గారు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
Latest News