"ప్రజలు తిరస్కరించారు.. ప్రచారం కోసం కోర్టుకు వచ్చారా": జన్ సూరాజ్ పార్టీకి సీజేఐ సూటి ప్రశ్నలు
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 09:32 PM

ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ (పీకే) నేతృత్వంలోని 'జన్ సూరాజ్' పార్టీకి సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. గతేడాది నవంబర్‌లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం జన్ సూరాజ్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు కాబట్టి.. ప్రచారం కోసం కోర్టుకు వచ్చారా అంటూ సూటిగానే ప్రశ్నించింది.


"ప్రజలు తిరస్కరించారు.. పబ్లిసిటీ కోసం వస్తారా?"


విచారణ ప్రారంభం కాగానే ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. "ఎన్నికల్లో మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారు. ఇప్పుడు ఆ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి, పబ్లిసిటీ పొందడానికి ఈ న్యాయస్థానాన్ని వేదికగా వాడుకోవాలని చూస్తున్నారా?" అని సీజేఐ నిలదీశారు. పోటీ చేసిన 238 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవని పార్టీ.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృధా చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.


అసలు వివాదం ఏంటి?


ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కో కుటుంబంలోని మహిళకు రూ. 10,000 పంపిణీ చేసిందని జన్ సూరాజ్ పార్టీ ఆరోపించింది. సుమారు 25 నుంచి 35 లక్షల మంది మహిళా ఓటర్లకు ఈ లబ్ధి చేకూర్చడం ద్వారా ఓట్లను 'కొనుగోలు' చేశారని పీకే వాదించారు. ఈ పథకం వల్లే జేడీయూ ఊహించని విధంగా 85 సీట్లు గెలుచుకుందని, ఇది ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.


 జన్ సూరాజ్ తరపున సీనియర్ అడ్వకేట్ సి.యు. సింగ్ వాదిస్తూ.. ఇది కేవలం అవినీతికి సంబంధించింది మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందని చెప్పారు. అయితే దీనిపై స్పందించిన జస్టిస్ జోయ్మల్య బాగ్చీ.. "మీరు అధికారంలోకి వస్తే మీరు కూడా ఇదే చేస్తారు కదా" అని వ్యాఖ్యానించారు. ఉచితాల అంశంపై కోర్టు సీరియస్‌గా ఉందని, అయితే స్వార్థ ప్రయోజనాలు ఉన్న రాజకీయ పార్టీల కంటే.. ప్రజా ప్రయోజనం ఆశించే వారు చేసే పిటిషన్లను వినడానికే మొగ్గు చూపుతామని కోర్టు స్పష్టం చేసింది.


హైకోర్టుకు వెళ్లండి!


ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశమని, దీని కోసం నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. బిహార్ హైకోర్టులో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. కేవలం 4 శాతం లోపు ఓట్ల షేర్ సాధించిన జన్ సూరాజ్ పార్టీ.. ఇలాంటి దౌత్యపరమైన పోరాటాలతోనైనా తమ ఉనికిని చాటుకోవాలని చూస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే న్యాయస్థానం కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Latest News
India can play key role as world's manufacturing partner: PM Modi Tue, Mar 03, 2026, 02:41 PM
4.3-magnitude quake hits Iran amid escalating Israeli offensive Tue, Mar 03, 2026, 02:30 PM
T20 WC: What will happen if SA vs NZ semi-final is washed out? Tue, Mar 03, 2026, 02:27 PM
Sindhu safely returns home after being stranded in Dubai for 3 days Tue, Mar 03, 2026, 12:58 PM
PM Modi surpasses 30 million YouTube subscribers, emerges as most followed global leader Tue, Mar 03, 2026, 12:55 PM