|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 07:59 PM
ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ భారత్ సిటీ నివాస సముదాయంలో ముగ్గురు మైనర్ బాలికలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తొలుత ఈ కేసులో తండ్రి మొబైల్ ఫోన్లు లాక్కున్నారనే కోపంతోనే చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారని భావించినప్పటికీ.. పోలీసుల లోతైన విచారణలో విస్తుపోయే కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధానంగా చిన్నారుల తండ్రి చేతన్ కుమార్ గతం, అతని వింతైన కుటుంబ నిర్మాణం ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి.
పదేళ్ల క్రితం కూడా ఇదే సీన్!
ముగ్గురు బాలికల తండ్రి చేతన్ కుమార్కు నేర చరిత్ర లేదా పాత కేసులతో సంబంధం ఉందా అని ఆరా తీస్తున్న పోలీసులకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2015లో సాహిబాబాద్ ప్రాంతంలోని రాజేంద్ర నగర్ కాలనీలో ఒక మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె చేతన్ కుమార్తో అప్పట్లో సహజీవనం చేసింది. ఆ సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోగా.. పోలీసులు కేసును కొట్టివేశారు. అయితే ఇప్పుడు అదే వ్యక్తి ముగ్గురు కుమార్తెలు.. ఒకేసారి భవనం పైనుంచి దూకి ప్రాణాలు వదలడం యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు పునర్విచారణ జరుపుతున్నారు.
ఇది మాత్రమే కాకుండా చేతన్ కుమార్పై పోలీసులు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు మొత్తంగా ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరంతా సొంత అక్కాచెల్లెల్లు (సుజాత, హీన, టీనా) కావడం గమనార్హం. అది మాత్రమే కాకుండా వీరంతా ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. మరణించిన నిషిక (16) తల్లి సుజాత కాగా, ప్రాచి (14), పాఖీ (12) తల్లి హీన. మూడో భార్య టీనాకు కూడా ఒక చిన్నారి ఉంది. ఇంట్లో ముగ్గురు భార్యలు, వారికి పిల్లలు ఉన్నప్పటికీ.. చేతన్ కుమార్ మరో అమ్మాయితో సహజీవనం చేయడం, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోవడం పోలీసులకు గట్టి షాక్ ఇస్తోంది. ఇది మాత్రమే కాకుండా స్టాక్ బ్రోకర్గా పని చేసే చేతన్ సుమారు రూ. 2 కోట్ల అప్పుల్లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇంటి కరెంట్ బిల్లులు కట్టడానికి చిన్నారుల మొబైల్ ఫోన్లను కూడా అతను అమ్మేశాడు. అలాగే ఫీజులు కట్టలేక రెండేళ్లుగా పిల్లలను స్కూలుకు కూడా పంపించలేదు చేతన్ కుమార్.
కోరియన్ గేమ్స్.. ఎనిమిది పేజీల సూసైడ్ నోట్
మరోవైపు కరోనా తర్వాత నుంచి చిన్నారులు కొరియన్ గేమ్స్ ఆడడానికి అలవాటు పడ్డారు. అది చాలదన్నట్లు తల్లిదండ్రులు.. పిల్లలను బడికి కూడా పంపించకపోవడంతో ఇంట్లోనే ఉంటున్న వీరు పూర్తిగా గేమ్స్కు అలవాటు పడిపోయారు. ఈక్రమంలోనే తండ్రి ఫోన్ లాక్కొని అమ్మేయడం, అంతకు ముందే సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం వంటివి చేయడంతో.. చిన్నారులు తీవ్రంగా కుంగిపోయారు. డైరీలో 8 పేజీల లేఖ రాసి పెట్టి మరీ ముగ్గురూ 9వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
Latest News