|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 08:37 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ఎన్డీఏ గట్టి పోటీ ఇవ్వనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్డీటీవీ ప్రాఫిట్ సదస్సు 2026లో పాల్గొన్న నిర్మలమ్మ మాట్లాడుతూ.. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిే) బలంగా, చెక్కుచెదరకుండా ఉందని, చాలా సమన్వయంతో ముందుకు సాగుతోందని తెలిపారు..‘హోరాహోరీ పోరు తప్పదు.. విజయంపై అధికార డీఎంకే నమ్మకంగా లేదు.. గతేడాది నుంచి మేము చేపట్టిన ప్రదర్శనలు, సభలతో ఒత్తిడికి గురవుతుంది’ అని సీతారామన్ వ్యాఖ్యానించారు. నటుడు విజయ్ పార్టీ తమిళ వెట్రి కళగం కూడా తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగుతోంది.
‘వారు [డీఎంకే] మంత్రుల చేస్తున్న వ్యాఖ్యలు, ప్రకటనలు, ఉచిత వాగ్దానాలు, ఆలయాల పర్యటనలు వంటివి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని అధికార పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆందోళన చెందుతోందని స్పష్టం చేస్తున్నాయి’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. తమిళనాడు, అభివృద్ధి గురించి మాట్లాడితే ఇకపై ఓట్లు పొందలేమని డీఎంకే గ్రహించినట్టు ఉందన్నారు. డీఎంకే పరిధి పరిమితమని, రాష్ట్రం వెలుపల దానికి ఆదరణ లేదని ఆమె అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించేలా కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ , బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆదాయ పంపిణీ విషయంలో దక్షిణ రాష్ట్రాలపై వివక్ష చూపుతోందన్న స్టాలిన్ తరుచూ చేసే ఆరోపణలకు నిర్మలమ్మ గట్టి సమాధానం ఇచ్చారు. ‘కేంద్రం కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల కోసమే కాకుండా, అందరి కోసం పనిచేస్తుంది. రాష్ట్రాలు చేస్తున్న అప్పులు సుస్థిరం కాదని మేము వారికి చెప్పాం’ అని ఆమె అన్నారు.
త్వరలోనే తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ కూటమిగా ఏర్పడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మదురైలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు ముందు తమ కూటమిలో కొన్ని పార్టీలు చేరుతాయని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయానర్ నాగేంద్రన్ అన్నారు.
మదురైలో ఒక భారీ సభను ఏర్పాటు చేవామని, ఎన్డీఏ నాయకులందరూ ప్రధానితో కలిసి వేదికను పంచుకుంటారని ఆయన చెప్పారు. తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయాన్ని మోదీ సందర్శించే అవకాశం ఉందని నాగేంద్రన్ తెలిపారు. మదురై విమానాశ్రయం సమీపంలోని మండేలా నగర్లో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 23న చెన్నై సమీపంలోని మదురాంతకంలో ఎన్డీఏ మొదటి ఎన్నికల సభను మోదీ ప్రారంభించారు.
Latest News