|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 08:41 PM
ఓ కేసులో పరారీలో ఉన్న నిందితుడైన యువకుడ్ని పట్టుకోడానికి పోలీసులు రెండు నెలలుగా గాలింపు కొనసాగిస్తున్నారు. అతడి ఆచూకీ చెబితే రూ.25 వేలు ఇస్తామని కూడా ప్రకటించారు. చివరకు ఇటీవలే అతడు వివాహం చేసుకుంటున్నట్టు తెలిసి.. ఆ కళ్యాణ మండపం దగ్గర అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే తంతు ముగియడంతో అక్కడ నుంచి ఆ యువకుడు తప్పించుకున్నాడు. కానీ, చివరకు హనీమూన్కు వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. సినిమాను తలపించే ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
సతారా జిల్లా ఎస్పీ రాజేశ్ ద్వివేది వెల్లడించిన వివరాల ప్రకారం.. 27 ఏళ్ల అక్షయ్ కదమ్ గతేడాది డిసెంబరు 19 తన స్నేహితులతో కలిసి ఉత్తర్ప్రదేశ్ షాజహాన్పుర్కు వెళ్లాడు. అక్కడ యూపీకి చెందిన బీజేపీ నేత దివాకర్ సింగ్కు చెందిన హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడి, విధ్వంసం సృష్టించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకోగా.. వారి పట్ల కూడా దురుసుగా వ్యవహరించారు. దీంతో పోలీసులు అక్షయ్, అతడి అనుచరులు నలుగురిపై కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి యువకుడు పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి జాడ కోసం గాలించిన పోలీసులు.. సమాచారం చెప్పిన వారికి రూ.25 వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అతడికి పెళ్లి జరుగుతున్నట్టు తెలిసింది. ఓ కళ్యాణ మండపంలో వివాహం చేసుకుంటున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. కానీ, అప్పటికే పెళ్లి తంతు ముగియడం... పోలీసులు వస్తున్న విషయంపై తెలియడంతో అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. అయినా పోలీసులు వదిలిపెట్టలేదు. భార్యతో హనీమూన్కు వెళ్తుండగా సతారా జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. అయితే, పెళ్లైన రెండు రోజుల్లోనే వరుడ్ని అరెస్ట్ చేయడంతో నవ వధువు సంతోషం ఆవిరయ్యింది.
Latest News