|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 08:26 PM
పొట్టి ప్రపంచకప్లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్పై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఇండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించడంతో, ఫిబ్రవరి 15న జరగాల్సిన హై ఓల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? లేక రద్దవుతుందా? అనే అంశంపై కోట్లాది మంది అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై శ్రీలంక క్రికెట్ పాక్ బోర్డుకు ఈమెయిల్ పంపగా, ఐసీసీ ప్రతినిధులు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ మంతనాలు జరుపుతున్నారు.ఈ నేపథ్యంలో ఇండో–పాక్ మ్యాచ్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన వైఖరిని స్పష్టం చేసింది. సాధారణంగా ఐసీసీ, ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే టోర్నమెంట్లలోనే తలపడుతున్న భారత్, పాకిస్థాన్ జట్లు టీ20 వరల్డ్కప్లో ఢీకొంటాయా? అనే అనిశ్చితి ఇంకా తొలగలేదు. మూడు కీలక డిమాండ్లను అంగీకరిస్తేనే ఇండియాతో ఆడతామని పాక్ బోర్డు ఐసీసీకి స్పష్టం చేయడంతో, తుది నిర్ణయం కోసం అందరి చూపు ఐసీసీపైనే నిలిచింది.ఈ అంశంలో బీసీసీఐ మాత్రం స్పష్టతతో వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి 15న భారత జట్టు కొలంబోకు వెళ్లనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన బీసీసీఐ, తాజా పరిణామాలపై స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, లీగ్ దశలో కొలంబోలో జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో ఐసీసీ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీసీసీఐ చేయాల్సిందేమీ లేదని, ఐసీసీ నిర్ణయమే తుది నిర్ణయమని ఆయన తెలిపారు.ఇదిలా ఉండగా, బాయ్కాట్ వార్తలపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందించారు. ఫిబ్రవరి 15న కొలంబోకు వెళ్లేందుకు భారత జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని, ఆ రోజుకు ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నామని ఆయన వెల్లడించారు. మ్యాచ్ ఆడమని పాక్ బోర్డే సూచించిందని, టీమిండియా ఆడేందుకు సిద్ధంగా ఉందని సూర్యకుమార్ తెలిపారు.అంతకుముందు సైకియా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ, లీగ్ దశ మ్యాచ్ కోసం ఫిబ్రవరి 15న భారత జట్టు కొలంబో చేరుకుంటుందని, మ్యాచ్ సమయానికి ఆటగాళ్లంతా స్టేడియంలో ఉంటారని అన్నారు. రిఫరీ అధికారికంగా మ్యాచ్ రద్దు ప్రకటించిన తరువాతే టీమిండియా స్వదేశానికి తిరుగు ప్రయాణం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
Latest News