ఏపీలో ఆ నాలుగుచోట్ల గ్రీన్‌ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినల్స్.... కేంద్రానికి చంద్రబాబు రిక్వెస్ట్
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 08:57 PM

ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీల సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులతో పాటుగా కొత్త ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు కూడా సమర్పించారు చంద్రబాబు. ఈ క్రమంలోనే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టుల గురించి ఇరువురు నేతలూ చర్చించారు. ఇప్పటికే పనులు జరుగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతితో పాటుగా.. కొత్త రైల్వే లైన్లు, సర్వీసులపై చంద్రబాబు చర్చించారు. అలాగే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఓ వినతి పత్రం సమర్పించారు. ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో కేంద్రం ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.


ఈ ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడు ఏపీ మీదుగా వెళ్తుండటంపై రైల్వే మంత్రికి చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే సమయంలో ఓ కొత్త ప్రతిపాదన చేశారు. బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టును తిరుపతితో కనెక్ట్ అయ్యేలా చూడాలని చంద్రబాబు కోరారు. అలాగే రాజధాని అమరావతితోపాటుగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో గ్రీన్‌ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిని చంద్రబాబు కోరారు. అలాగే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా గెజిట్ విడుదల చేయాలని కోరారు.


మరోవైపు రాయలసీమలో అరటి పంటను రైతులు ఎక్కువగా సాగుచేస్తుంటారు. ఇటీవల అరటి రేట్లు పతనమైన సమయంలోనూ రైతులు పలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో రాయలసీమ అరటి రైతులను దృష్టిలో చంద్రబాబు కేంద్రం వద్ద కొత్త ప్రతిపాదన చేశారు. తాడిపత్రి నుంచి ముంబై పోర్టుకు అరటిని ఎగుమతి చేసేందుకు 50 శాతం సబ్సిడీ మీద ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలని కోరారు. అలాగే ఇటార్సీ- విజయవాడ మధ్యన ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు.


విశాఖపట్నం -విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్, తిరుపతి-చిత్తూరు మార్గంలో హైస్పీడ్ లింక్ కారిడార్, విజయవాడ-కర్నూలు రూట్లో సెమీ హైస్పీడ్ కారిడార్ మంజూరు చేయాలని రైల్వే మంత్రికి చంద్రబాబు వినతిపత్రం సమర్పించారు. శ్రీశైలానికి కనెక్టివిటీని పెంచాలని. విజయవాడ-బెంగుళూరు మార్గంలో తిరుపతి మీదుగా వందేభారత్ సర్వీసును నడపాలని కోరారు. కుప్పం రైల్వేస్టేషన్‌‍లో పలు రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలని రైల్వే మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Latest News
US 'forced' into ceasefire, says Iranian Supreme Leader’s India representative Wed, Apr 08, 2026, 04:43 PM
BJP leader criticises Khera over 'Hyderabad escape', says Cong left with no safe havens Wed, Apr 08, 2026, 04:41 PM
Coordination, monitoring & timely execution important for grassroots delivery of developmental schemes: Jitendra Singh Wed, Apr 08, 2026, 04:28 PM
Tejashwi Yadav targets Health Minister Mangal Pandey over viral Gaya hospital video Wed, Apr 08, 2026, 04:13 PM
BJP accuses Cong of 'tukde tukde' politics as Gujarati groups protest in Delhi against Kharge's remarks Wed, Apr 08, 2026, 04:09 PM